For Money

Business News

నష్టాల్లో సింగపూర్ నిఫ్టి

ఈక్విటీ మార్కెట్లకు మళ్ళీ ద్రవ్యోల్బణ తలనొప్పి ప్రారంభమైంది. యుద్దంకన్నా ఇపుడు పెరుగుతున్న డాలర్‌, బాండ్‌ ఈల్డ్స్‌ పెద్ద సమస్యగా మారుతున్నాయి. వచ్చే నెలలోనే అరశాతం వడ్డీని పెంచడంతో పాటు ఉద్దీపన ప్యాకేజీలను క్రమం ఎత్తివేస్తామని ఫెడ్‌ వర్గాలు అంటున్నాయి. మార్కెట్‌ను ప్రభావితం చేసే మరో అంశం లేకపోవడంతో మార్కెట్‌లో ఇవే ప్రధాన అంశాలుగా మారాయి. కరెన్సీ మార్కెట్‌లో డాలర్‌ ఇండెక్స్‌ 100వైపు పరుగులు తీస్తోంది. రాత్రి అమెరికా మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. రాత్రి ట్విటర్‌ మినహా మిగిలిన టెక్‌, ఐటీ కంపెనీలు నష్టాల్లో ముగిశాయి. రాత్రి ట్విటర్‌ రెండు శాతం లాభపడగా, ఏఎండీ, యాపిల్‌. టెస్లా, మెక్రోసాఫ్ట్‌, అమెజాన్‌ రెండు నుంచి అయిదు శాతం వరకు క్షీణించాయి. నాస్‌డాక్‌ రెండు శాతంపైగా నష్టపోగా, ఎస్‌ అండ్‌ పీ 500 ఒక శాతంపైగా పడింది. ఎకానమీ షేర్ల పతనంఓత డౌజోన్స్‌ 0.8 శాతం క్షీణించింది. ఇక ఆసియా మార్కెట్లలో అదే ట్రెండ్‌ కన్పిస్తోంది. అన్ని మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. హాంగ్‌సెంగ్‌, సింగపూర్‌ రెండు శాతం దాకా నష్టంతో ఉన్నాయి. రెండు రోజుల తరవాత ఓపెనైన చైనా మార్కెట్‌ నష్టాలు ఒక శాతంలోపే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సింగపూర్‌ నిఫ్టి 155 పాయింట్ల నష్టంతో ఉంది. సో… నిఫ్టి కూడా భారీ నష్టాలతో ప్రారంభం కానుంది.