For Money

Business News

థర్డ్‌ పార్టీ వెహికల్ బీమా రేట్లు ఇవి

కార్లు, టూవీలర్ల బీమా ప్రీమియంలు ఏప్రిల్‌ 1 నుంచి పెరగనున్నాయి. దీనికి సంబంధించి కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ముసాయిదా నుంచి ప్రతిపాదించింది. ఈ నెలాఖరు వరకు ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించనుంది. ఆ వెంటనే తుది నోటిఫికేషన్‌ విడుదల చేస్తుంది. గతంలో ఇన్సూరెన్స్‌ రెగ్యులేటర్‌ ఐఆర్‌డీఏఐ టీడీ రేట్లను నోటీఫై చేసేది. తొలిసారిగ రోడ్డు రవాణా శాఖ ఈ దఫా నోటీఫై చేయనుంది. ముసాయిదా నోటీఫికేషన్‌ ప్రకారం ఎలక్ట్రిక్‌ ప్రైవేట్‌ కార్లు, ఎలక్ట్రిక్‌ టూవీలర్లు, ఎలక్ట్రిక్‌ రవాణా వాణిజ్య వాహనాలు, ప్రయాణీకుల్ని చేరవేసే ఎలక్ట్రిక్‌ వాహనాలకు ఇన్సూరెన్స్‌ ప్రీమియంలో 15 శాతం డిస్కౌంట్‌ ఇవ్వనున్నారు. సవరించిన రేట్ల ప్రకారం 1000 సీసీ ప్రైవేట్‌ కార్లపై థర్డ్‌ పార్టీ ప్రీమియం రూ. 2072 నుంచి రూ. 2094కు, 1000 సీసీ పైన 1500 సీసీలోగా ఉన్నకార్లకు రూ.3221 నుంచి రూ.3416కు పెంచారు. అలాగే 1500 సీసీ దాటిన కార్ల ప్రీమియం రూ. 7890కి చేరుతుంది. ఇక టూ వీలర్ల విషయంలో 150 సీసీపైన ఉన్న బైక్స్‌కు ప్రీమియం రూ.1366, అంతకుమించిన సీసీ ఉన్న బైక్‌లకు రూ.2804 చెల్లించాల్సి ఉంటుంది. కోవిడ్‌ కారణంగా గత రెండేళ్ళుగా ప్రీమియంలు పెంచలేదు.