For Money

Business News

మార్కెట్‌ను మళ్లీ నిరాశపర్చింది

వేల కోట్ల నుంచి వందల కోట్లకు నష్టం తగ్గింనందుకు సంతోషపడాలా? ఇంకా మార్కెట్‌ అంచాలను అందుకోలేని కంపెనీ పనితీరు చూసి ఏడ్వాలో టాటా మోటార్స్‌ ఇన్వెస్టర్లకు అర్థం కాలేదు. ప్రతి త్రైమాసికంలో వేల కోట్ల నష్టాలను చూపిన టాటా మోటార్స్‌ ఇపుడు వందల కోట్ల నష్టాలను చూపింది. కంపెనీ భవిష్యత్తు పనితీరు. ఈవీ రంగంలో రాణిస్తుందనే నమ్మకంతో ఈ షేర్‌ ఇప్పటికే బాగా పెరిగింది. అయితే ఇవాళ వెల్లడైన ఫలితాలు మాత్రం మార్కెట్‌ను నిరాశపర్చాయి. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో టాటా మోటార్స్ రూ. 944 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. వాస్తవానికి మార్కెట్‌ ఈ త్రైమాసికంలో కంపెనీ రూ. 655 కోట్ల నికర లాభం ఆర్జిస్తుందని అంచనా వేసింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ. 4,441.57 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. గత ఏడాది పనితీరుతో పోలిస్తే మెరుగ్గా ఉన్నట్లు కన్పించినా… మార్కెట్‌ అంచనాలను కంపెనీ అందుకోలేకపోయింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో టాటా మోటార్స్ కన్సాలిడేటెడ్ ఆదాయం 29.7% పెరిగి రూ. 79,611.37 కోట్లకు చేరింది. ఇది గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ టర్నోవర్‌ రూ. 61,378.82 కోట్లు. ఈ త్రైమాసికంలో జేఎల్‌ఆర్‌ ఆదాయం 530 కోట్ల యూరోలని కంపెనీ పేర్కొంది.గత ఏడాదికన్నా 36% మేర పెరిగింది. చిప్ సరఫరాదారులతో దీర్ఘకాలిక ఒప్పందాలపై జేఎల్ఆర్ సంతకం చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే చిప్‌ల సరఫరా బాగా మెరుగుపడినట్లే భావించాలి. జాగ్వార్ ల్యాండ్ రోవర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ థియరీ బోలోరే మాట్లాడుతూ, ‘సెమీకండక్టర్ల కొరత ఉన్నా తమ కొత్త రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ స్పోర్ట్‌ ఉత్పత్తి పెరిగింది. ఆదాయం, మార్జిన్‌, క్యాష్ ఫ్లో కూడా మెరుగుపరడటంతె రెండో త్రైమాసికంలో బలమైన ఆర్థిక పనితీరును అందించినట్లు’ తెలిపారు.