For Money

Business News

ఎల్‌ఐసీ ఐపీఓ… తగ్గేదేలే!

స్టాక్‌ మార్కెట్‌లో ఒడిదుడుకులకు ఉన్నా… ఎల్‌ఐసీ ఐపీవో షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు ఉండదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిణామాల నేపథ్యంలో మంత్రి ఈ మాటలు అన్నారు. ఇష్యూ జారీకి మార్కెట్‌ పరిస్థితి అనుకూలంగా ఉంటుందా అనే ఆందోళన సైతం తమకు ఉందన్నారు. రెండ్రోజుల ముంబై పర్యటనలో పారిశ్రామిక, వ్యాపారవేత్తలు, బ్యాంకర్లతో భేటీ జరిపిన తర్వాత మీడియాతో ఆర్థిక మంత్రి మాట్లాడుతూ ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసిన అనంతరం ఎల్‌ఐసీ ఐపీవో పట్ల ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరిగిందని తెలిపారు. మరోవైపు ఇటీవల వార్తల్లో ఉంటున్న ఎన్‌ఎస్‌ఈలో కార్పొరేట్‌ గవర్నెన్స్‌, నిర్వహణా లోపాలపై తాము దృష్టిపెట్టామని ఆర్థిక మంత్రి అన్నారు. ఇటీవల సెబీ జారీచేసిన ఉత్తర్వుల్ని ప్రస్తావించగా, ఈ కేసులో నియంత్రణాపరమైన చర్యలు సరిగ్గా ఉన్నాయా లేదా అనే అంశంపై వ్యాఖ్యానించబోనన్నారు. ఇందుకు సంబంధించి తనకు చేరిన సమాచారాన్ని పరిశీలిస్తున్నాని చెప్పారు.