25000 దిగువకు నిఫ్టి

అమెరికా మార్కెట్ల వీక్నెస్ మన మార్కెట్లను దెబ్బతీసింది. మంచి ఫలితాలు ప్రకటించిన షేర్లన్నీ ఇవాళ ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. అయితే మార్కెట్ సెంటిమెంట్ మాత్రం బలహీనంగా ఉంది. అమెరికా క్రెడిట్ రేటింగ్ మూడీస్ తగ్గించడంతో అమెరికా ఫ్యూచర్స్ నష్టాల్లోకి జారకున్నాయి. ఉదయం ఒక మోస్తరుగా ఉన్న నష్టాలు మన మార్కెట్ ముగిసే సమయానికి ఒక శాతంపైగా పెరిగాయి. దీంతో ఇటీవల పెరిగిన అనేక షేర్లలో ఇవాళ లాభాల స్వీకరణ కన్పించింది. ముఖ్యంగా డిఫెన్స్ షేర్లలో ఇదే ట్రెండ్ కన్పించింది. ఫలితాలు బాగున్న దివీస్ ల్యాబ్, డెలివరీ షేర్లు ఇవాళ బాగా లాభపడ్డాయి. నిఫ్టి 74 పాయింట్ల నష్టంతో 24945 వద్ద ముగిసింది. అంటే 25000 దిగువన క్లోజైందన్నమాట. బ్యాంక్, ఫైనాన్స్ వంటి కొన్ని ప్రధాన రంగాల సూచీలు గ్రీన్లో ముగిసినా… నిఫ్టి ఐటీ బాగా దెబ్బతీసింది. ఇటీవల ఈ సూచీ బాగా పెరిగింది. ఇవాళ నిఫ్టిలో 3000లకుపైగా షేర్లు ట్రేడవగా, 1842 షేర్లు గ్రీన్లో, 1074 షేర్లు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టి షేర్లలో బజాజ్ ఆటో టాప్ గెయినర్ కాగా, ఇతర స్థానాల్లో శ్రీరామ్ ఫైనాన్స్, పవర్ గ్రిడ్, హీరో మోటో కార్ప్, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి. ఇక నష్టాలతో ముగిసిన నిఫ్టి షేర్లలో ఎటర్నల్ (జుమాటొ) టాప్లో ఉంది. ఈ కంపెనీలో చైనా కంపెనీ యాంట్ కొంత వాటాను అమ్మునుంది. ఈ షేర్ తరవాత మిగిలిన స్థానాల్లో గ్రాసిం, ఇన్ఫోసిస్, టాటా కన్జూమర్, డాక్టర్ రెడ్డీస్ ఉన్నాయి.