For Money

Business News

నిఫ్టి… మరో వంద పాయింట్లు కట్‌

తొలిసారి 100 రోజుల చలన సగటుకు దిగువన క్లోజైంది నిఫ్టి. దిగువ నుంచి రెండు సార్లు కోలుకునేందుకు విఫలయత్నం చేసింది. ఉదయం అనుకున్నట్లు యూరో మార్కెట్ల పతనం నిఫ్టిని దెబ్బతీసింది. స్క్వేర్‌ ఆఫ్‌ టైమ్‌కు ముందు 17300 దాటిన నిఫ్టి… చివర్లో ఉండలేకపోయింది. లాభాల స్వీకరణతో మరో వంద పాయింట్లు కోల్పోయింది. ఒకదశలో 17,192కు పడింది. క్రితం ముగింపుతో పోలిస్తే 103 పాయింట్ల నష్టంతో 17221 వద్ద ముగిసింది. అంటే 100 రోజుల చలన సగటు అయిన 17260 దిగువన నిఫ్టి క్లోజైందన్నమాట. ఒక్క బ్యాంక్‌ నిఫ్టి మినహా.. మిగిలిన అన్ని సూచీలు అర శాతం కంటే అధికంగా నష్టపోయాయి. అత్యధికంగా 0.85 శాతం చొప్పున మిడ్‌ క్యాప్‌ నిఫ్టి క్షీణించింది. నిఫ్టి నెక్ట్స్‌, ఫైనాన్షియల్స్‌ నిఫ్టి కూడా దాదాపు ఇంతే నష్టంతో ముగిశాయి. ఎన్‌బీఎఫ్‌సీ దిగ్గజాలైన బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్ ఫిన్‌ సర్వ్‌లు ఇవాళ కూడా టాప్‌ లూజర్స్‌గా నిలిచాయి. నిన్న మూడు శాతం క్షీణించిన బజాజ్‌ ఫైనాన్స్‌ ఇవాళ కూడా మరో 3 శాతం తగ్గి రూ.6,859 వద్ద ముగిసింది. మిడ్‌ క్యాప్‌లో గోడ్రెజ్‌ ప్రాపర్టీస్‌ మూడు శాతం పైగా నష్టంతో ముగిసింది. టాటా వపర్‌ 3 శాతం లాభంతో టాప్‌ గెయినర్‌గా నిలిచింది.