అదానీ గ్రీన్లో ఇన్సైడర్ ట్రేడింగ్?

అమెరికా ఫెడరల్ కోర్టులో తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న అదానీ ఎనర్జి మెడకు మరో అవినీతి చుట్టుకుంది. ఈ కంపెనీ షేర్లలో అదానీ బంధువుల్లో ఒకరు ఇన్సైడర్ ట్రేడ్కు పాల్పడినట్లు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబి ఆరోపించింది. అదానీ గ్రీన్లో అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీకి సమీప బంధువు అయిన ప్రణవ్ అదానీ ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడినట్లు సెబి ఆరోపించింది. దీనికి సంబంధించి ప్రణవ్ అదానీకి సెబీ నోటీసులు ఇచ్చినట్లు రాయింటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. 2021లో ఎస్బీ ఎనర్జి హోల్డింగ్ అనే కంపెనీని అదానీ ఎనర్జి టేకోవర్ చేసింది. ఈ టేకోవర్ అంశాన్ని ముందుగానే తన అల్లుడైన కునాల్ షాకు ప్రణవ్ అదానీ చెప్పినట్లు సెబీ ఆరోపిస్తోంది. దీనికి సంబంధించి ఆయనకు నోటీసు పంపింది. దీనిపై క్లారిటీ కోసం ప్రణవ్కు లేఖ రాసినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. నోటీసు వచ్చిందా లేదా అన్న అంశంపై స్పష్టమైన సమాధానం ప్రణవ్ ఇవ్వలేదని, అయితే ఈ అంశాన్ని సెబీతో సెటిల్ చేసుకుంటామని చెప్పినట్లు రాయిటర్స్ పేర్కొంది. అంటే పరోక్షంగా తనకు నోటీసు అందినట్లు ప్రణవ్ అంగీకరించినట్లయింది.