4 నెలల కనిష్ఠానికి పారిశ్రామిక వృద్ధి
దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి చతికిల పడింది. జూలై నెలలో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) నాలుగు నెలల కనిష్ఠస్థాయి 2.4 శాతానికి పడిపోయింది. విద్యుత్, మైనింగ్ రంగాలు దారుణంగా దెబ్బతినడమే డీనికి కారణం. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 6.7 శాతం, మే నెలలో 19.6 శాతం, జూన్ నెలలో 12.7 శాతం చొప్పున వృద్ధిని కనపర్చిన ఐఐపీ జూలైలో భారీగా పతనంకావడం గమనార్హం. 2021 జూలైలో ఐఐపీ 11.5 శాతం వృద్ధి చెందింది. గత జూలైలో 10.5 శాతం వృద్ధిచెందిన తయారీ రంగం ఈ ఏడాది ఇదే నెలలో 3.2 శాతమే పెరిగిందని ఎన్ఎస్ఓ పేర్కొంది.
విద్యుత్ రంగం వృద్ధి కూడా 11.1 శాతం నుంచి 2.3 శాతానికి పడిపోయింది. ఇక
మైనింగ్ రంగానికి మరింత దారుణ పరిస్థితి. గత ఏడాది ఇదే కాలంలో 19.5 శాతం వృద్ధి సాధించిన ఈ రంగం ఈ ఏడాది -3.3 శాతానికి పడిపోయింది. ప్రైమరీ గూడ్స్ ఉత్పత్తి 12.4 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గడంతో మొత్తంమీద ఐఐపీ గణాంకాలు భారీగా తగ్గాయి.