భారీగా తగ్గిన కరెంట్ అకౌంట్ లోటు
గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో అంటే 2023 జనవరి నుంచి మార్చి మధ్య కాలంలో భారతదేశ కరెంట్ అకౌంట్ లోటు గణనీయంగా తగ్గింది. వాణిజ్య లోటు తగ్గడం ఇదే సమయంలో సేవల ఎగుమతులు గణనీయంగా పెరగడంతో 2022-23 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కరెంట్ అకౌంట్ లోటు (సీఏడీ) 130 కోట్ల డాలర్లకు తగ్గింది. ఈ విషయాన్ని ఆర్బీఐ వెల్లడించింది. ఇది దేశ జీడీపీలో 0.2శాతానికి సమానం. ఇదే సమయంలో భారత్లోకి 640 కోట్ల డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రావడం కూడా కరెంటు లోటు తగ్గడానికి దోహదపడింది. అయితే ఇదే సమయంలో భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు మాత్రం బాగా క్షీణించాయి. గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో కరెంటు లోటు 1,680 కోట్ల డాలర్లుగా ఉంది. ఇది జీడీపీలో 2 శాతం. ఎన్నారైలు మన దేశానికి పంపిన మొత్తం కూడా 2,860 కోట్ల డాలర్లకు చేరడం కూడా విశేషం. ఏడాది క్రితం కంటే ఈ మొత్తం 20.8శాతం అధికం.