For Money

Business News

HYD: ఇళ్ల ధరల్లో 8% పెరుగుదల

ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో దేశంలోని 8 ప్రధాన నగరాల్లో నివాస గృహాల ధరల పెరుగుదల సగటు 5 శాతంగా ఉందని ఓ నివేదిక వెల్లడించింది. ఇళ్లకు డిమాండ్‌తో పాటు నిర్మాణ వ్యయాలు కూడా పెరగడం ఇందుకు కారణాలని తెలిపింది. రియల్టీ రంగ సంఘం క్రెడాయ్‌, రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టింగ్‌ కంపెనీ కొలియర్స్‌ ఇండియా, డేటా అనలిటిక్స్‌ సంస్థ లియాసెస్‌ ఫోరాస్‌ కలిసి ‘హౌసిం గ్‌ ప్రైస్‌ ట్రాకర్‌ రిపోర్టు 2022’ను విడుదల చేశాయి. ఈ నివేదిక ప్రకారం.. సమీక్షా కాలానికి హైదరాబాద్‌లో గృహాల రేట్లు వార్షిక ప్రాతిపదికన 8 శాతం పెరిగి చదరపు అడుగు సగటు ధర రూ.9,218కి చేరుకుంది. కాగా, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ఇళ్ల ధరలు అత్యధికంగా 10 శాతం పెరిగాయి. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, ముంబై, కోల్‌కతా, పుణె, హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్‌ నగరాలలో ఇళ్ళ ధరలు పెరగడంతో పాటు అన్‌సోల్డ్‌ ఇన్వెంటరీ కూడా పెరిగిందని ఈ నివేదిక వెల్లడించింది. ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌, ముంబై, అహ్మదాబాద్‌లలో అన్‌సోల్డ్‌ ఇన్వెంటరీ పెరిగింది. కొత్త ప్రాజెక్టులు భారీగా ప్రారంభం కావడమే దీనికి కారణమని నివేదిక పేర్కొంది. బెంగళూరులో ఇన్వెంటరీ రికార్డు స్థాయిలో 21 శాతం తగ్గింది.