For Money

Business News

ఎస్‌ కుమార్స్‌పై సీబీఐ కేసు

టెక్స్‌టైల్‌ రంగంలో ప్రఖ్యాతి గాంచిన ఎస్‌ కుమార్స్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. బ్యాంకులకు రూ.1250 కోట్ల మేర మోసం చేశారన్న ఆరోపణలపై ఎస్‌ కుమార్స్‌ నేషనల్ వైడ్‌ లిమిటెడ్‌ కంపెనీతో పాటు దాని ప్రమోటర్లు, డైరెక్టర్లతో సహా 15 మందిపై కేసు నమోదు చేశారు. పశ్చిమ బెంగాల్‌, గుజరాత్‌, మహారాష్ట్రలో కంపెనీకి చెందిన 13 స్థావరాలపై సీబీఐ సోదాలు నిర్వహించింది. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ తెలిపింది. 2012 నుంచి 2018 మధ్య కాలంలో ఐడీబీఐ బ్యాంక్‌ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం నుంచి రూ 1245 కోట్ల రుణాన్ని తీసుకుంది. ఈ నిధులను దుర్వినియోగం చేసినట్లు బ్యాంకు తెలిపాయి. ఐడీబీఐ బ్యాంక్‌తో పాటు కన్సార్టియంలోని సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, జమ్మూ, కాశ్మీర్‌ బ్యాంక్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, ఇండియన్‌ బ్యాంకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీబీఐ తెలిపింది.