For Money

Business News

అమిత్‌ షాకు ఈ డీల్‌ తెలుసు

ఇపుడు మునుగోడు ఉప ఎన్నికల్లో కోమటి రెడ్డి బొగ్గు గని హాట్‌ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఏకంగా రూ. 18,264 కోట్ల ఈ కాంట్రాక్ట్‌ను నిబంధనలకు విరుద్ధంగా చర్చలు జరిపి కోమటి రెడ్డి ఫ్యామిలీ కంపెనీకి అప్పజెప్పారని అటు కాంగ్రెస్‌, ఇటు టీఆర్‌ఎస్‌ అనేక డాక్యుమెంట్లు విడుదల చేశాయి. అదానీ గ్రూప్‌ ఎల్‌ వన్‌గా నిలిచిన టెండర్‌ను రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలిచి … టెండర్‌లో పేర్కొన్న ధరకు కాకుండా చర్చల ద్వారా టెండర్‌ ఖరారు చేశారు. ఇంత భారీ కాంట్రాక్ట్‌ చేసే అర్హత, సామర్థ్యం కోటమి రెడ్డి ఫ్యామిలీకి చెందిన సుశీ ఇన్‌ఫ్రాకు లేదని టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ అంటున్నాయి. 2020-21లో సుశీ ఇన్‌ఫ్రా దాదాపు మైనింగ్‌ వ్యాపారాలే చేయలేదు. పైగా కంపెనీకి టెండర్‌లో పేర్కొన్న టర్నోవర్‌, నెట్‌వర్త్‌ లేదు. ఈ రెండు అర్హతల కోసం రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి కుటుంబానికి చెందిన ఎంఆర్‌కెఆర్‌ కన్‌స్ట్రక్షన్‌తో కన్సార్టియంగా బిడ్స్‌ వేశారు. ఈ కంపెనీలో స్వయంగా మల్లికార్జున రెడ్డి భార్యకు కూడా వాటా ఉంది. మిగిలిన వాటా కూడా ఆయన సోదరులదే. విచిత్రమేమిటంటే కేవలం బిల్డింగ్‌ రంగానికి మాత్రమే పరిమితమైన ఈ కంపెనీకి మైనింగ్‌ అస్సలు అనుభవం లేదు. అంటే బిడ్‌ వేసిన ఏడాదిలో కన్సార్టియంలోని రెండు కంపెనీలకు మైనింగ్‌ చేస్తున్న అనుభవం లేదు. అయినా బిడ్‌ వేశారు. తీరా కోమటి రెడ్డి కన్సార్టియం కోట్‌ చేసిన ధర అధికంగా ఉందని తేలడంతో చివరికి తక్కువ ధరకే బిడ్‌ను దక్కించుకున్నారు. ఏమాత్రం అర్హతలు లేని సుశీ ఇన్‌ఫ్రా, ఎంఆర్‌కేఆర్‌ కన్‌స్ట్రక్షన్‌ను ఎలా కాంట్రాక్ట్‌ ఇచ్చారని ఇపుడు టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నిలదీస్తున్నారు. ప్రధాని మోడీకి సన్నిహితమైన వ్యక్తి అనే గాక… మైనింగ్‌ రంగంలో అనుభవం ఉన్న అదానీని కాదని సుశీ ఇన్‌ఫ్రా కన్సార్షియంకు ఇవ్వడం వెనుక రాజకీయ నేతల హస్తం ఉందని.. కేవలం రాజకీయ కారణాల వల్లే ఈ కాంట్రాక్ట్‌ ఇచ్చారని తెలుస్తోంది. బొగ్గు ప్రాజెక్టులో మల్లికార్జున్‌ రెడ్డి ఫ్యామిలీ కంపెనీకి 26 శాతం వాటా దక్కింది. మైనింగ్‌లో ఏమాత్రం అనుభవం లేని కంపెనీ రూ.18000 కోట్ల కాంట్రాక్ట్‌లో 26 శాతం ఎలా ఇచ్చారనేది ఇపుడు ప్రశ్న? అన్నమయ్య జిల్లా ఏర్పనపుడు రాజంపేట కేంద్రంగా చేయాలని ఈ ఏడాది ఆరంభంలో పెద్ద ఉద్యమమే జరిగింది. ఆ ఉద్యమం జరుగుతున్న సమయంలోనే మల్లికార్జున రెడ్డి ఫ్యామిలీకి ఈ కాంట్రాక్ట్‌ దక్కడ విశేషం. సో… తూతూ మంత్రంగా ఉద్యమంలో పాల్గొన్న మల్లికార్జున రెడ్డి కూడా డ్రామా ఆడారన్నమాట?

(curtesy:chittinews)