వీఎస్టీలో వాటా కొన్న దమాని
ఇపుడు రాకేష్ ఝున్ఝున్ వాలా తరవాత రాధాకిషన్ దమాని వెంట ఇన్వెస్టర్లు పరుగులు పెడుతున్నారు. ఇండియా సిమెంట్ వంటి కంపెనీల్లో దమాని పెట్టుబడి పెట్టిన తరవాత ఆ కంపెనీ షేర్ భారీగా పెరిగింది. తాజాగా ఆయన వీఎస్టీ ఇండస్ట్రీస్లో 1.63 శాతం వాటాకు సమానమైన 2,51,484 షేర్లు కొనుగోలు చేశారు. దమానికి చెందిన బ్రైట్ స్టార్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా ఈ షేర్లు కొన్నారు. దమాని ఎప్పటి నుంచో ఈ కంపెనీలో షేర్లు కొంటున్నారు. తాజా కొనుగోళ్ళతో వీఎస్టీలో ఇపుడు దమానికి 25.95 శాతం వాటా ఉంది. దమానీ తాజాగా షేర్లు కొన్నట్లు తేలడంతో వీఎస్టీ షేర్ 5 శాతం దాకా పెరిగి చివర్లో మూడు శాతం లాభంతో రూ.3747 వద్ద ముగిసింది.