28న భూమి పూజ
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న గూగుల్ డేటా సెంటర్ వైపు మరో అడుగు పడింది. వైజాగ్ పరిసర ప్రాంతాల్లో రానున్న గూగుల్ డేటా సెంటర్కు ఈనెల 28న భూమి పూజ నిర్వహించనున్నారు. ఏకంగా 15 బిలియన్ డాలర్లతో మూడు డేటా సెంటర్లను గూగుల్ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయనుంది. ఈ నెల 28న జరిగే భూమి పూజలో ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్తో పాటు గూగుల్ ఉన్నతాధికారులు పాల్గొంటారు. అదానీతో పాటు ఇతర కంపెనీలతో కలిసి గూగుల్ ఈ డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. ఒక గిగావాట్స్ సామర్థ్యం ఉన్న మూడు డేటా సెంటర్లను గూగుల్ ఇక్కడ ఏర్పాటు చేస్తుంది. వైజాగ్. తర్లువాడ, రాంబిల్లిలో ఈ డేటా సెంటర్లు ఏర్పాటు అవుతాయి. డేటా సెంటర్ల ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే ఏపీ ప్రభుత్వంతో గూగుల్ ఎంఓయూ కుదుర్చుకుంది. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కూడా హాజరయ్యారు.
గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్కు ఇప్పటికే భూముల అప్పగింత కూడా జరిగిపోయింది. రాంబిల్లిలో నూట డెబ్భై నాలుగు ఎకరాలు, అడవివారంలో నూట అరవై ఎకరాలు, తర్లువాడలో రెండు వందల అరవైఆరు ఎకరాలను ఏపీ ప్రభుత్వం కేటాయించింది. గూగుల్ విజ్ఞప్తితో అదానీ ఇన్ఫ్రాకు కూడా ఆరువందల ఎకరాలను ఏపీ ప్రభుత్వం ఇచ్చింది. 2028లో ఈ డేటా సెంటర్లు పనిచేయడం ప్రారంభిస్తాయని కంపెనీ అంటోంది.
