25,000 పైన ముగిసిన నిఫ్టి
టెక్నికల్గా దిగువస్థాయిలో మద్దతు అందడంతో పాటు హర్యానాలో బీజేపీ ప్రభుత్వం హ్యాట్రిక్ సాధించడంతో మార్కెట్ ఇవాళ కోలుకుంది. ఆరంభంలో హర్యానా ఫలితాల ట్రెండ్తో నష్టాల్లోకి వెళ్ళిన నిఫ్టి 24736 పాయింట్ల కనిష్ఠ స్థాయిని తాకింది. అంతర్జాతీయంగా ముఖ్యంగా వాల్స్ట్రీట్ భారీ నష్టాలతో క్లోజ్ కావడంతో పాటు హాంగ్సెంగ్ నష్టాల్లో ఉండటంతో నిఫ్టిపై ఇవాళ ఒత్తిడి ఉంటుందని భావించారు. క్రమంగా హర్యానాలో బీజేపీ పుంజుకోవడంతో నిఫ్టి కూడా కోలుకుంది. మిడ్ సెషన్ సమయంలో స్వల్ప ఒత్తిడి వచ్చినా… వెంటనే కోలుకుంది. సరిగ్గా మూడు గంటలకు ముందు నిఫ్టిలో స్వల్ప లాభాల స్వీకరణ కన్పించింది. అయితే కొన్ని నిమిషాల్లోనే కొలుకుని 25,013 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 217 పాయింట్లు లాభపడింది. అలాగే సెన్సెక్స్ 584 పాయింట్ల లాభంతో క్లోజైంది. ఇవాళ దాదాపు అన్ని ప్రధాన రంగాల షేర్లకు మద్దతు లభించింది. నిఫ్టి టాప్ గెయినర్స్లో ట్రెంట్ అ్రగభాగాన నిలిచింది. ఈ షేర్ 8 శాతం లాభంతో రూ. 8042కు చేరడం విశేషం. నిఫ్టికి వచ్చిన తరవాత రోజూ పడుతూ వచ్చిన బీఈఎల్ షేర్ ఇవాళ 5 శాతంపైగా లాభంతో రూ.281 వద్ద ముగిసింది. అదానీ ఎంటర్ ప్రైజస్, అదానీ పోర్ట్స్ షేర్లు అయిదు శాతం చొప్పున పెరిగాయి. ఇక ఎం అండ్ ఎం మూడున్నర శాతం పెరిగింది. నిఫ్టి టాప్ లూజర్స్లో ఎస్బీఐ లైఫ్ మూడు శాతం నష్టంతో రూ. 1780 వద్ద క్లోజైంది. టాటా స్టీల్, టైటాన్, బజాజ్ ఫిన్ సర్వ్, జేఎస్డబ్ల్యూ స్టీల్ షేర్లు లూజర్స్లో తరవాతి స్థానాల్లో ఉన్నాయి.