ఈ రికవరీ ఎందాక?
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అనుకున్న స్థాయిలో రాణించకపోవడంతో మన స్టాక్ మార్కెట్లు నిన్న భారీగా క్షీణించాయి. ఇవాళ రికవరీ బాట పట్టాయి. మిత్ర పక్షాల అండతో మరోసారి ప్రభుత్వ ఏర్పాటుకు మోడీ రెడీ అవడంతో సూచీలు ఊపిరిపీల్చుకున్నాయి. నిఫ్టి మళ్ళీ 22600 స్థాయిని దాటి 22.620 స్థాయి వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 735 పాయింట్లు కోలుకుంది. నిఫ్టిట 3.36 శాతం లాభపడగా, మిడ్ క్యాప్ సూచీ ఏకంగా ఏడున్నర శాతం పెరిగింది. నిఫ్టి నెక్ట్స్ కూడా 5 శాతం దాకా పెరగడం విశేషం. ఇక బ్యాంక్ నిఫ్టి, ఫైనాన్షియల్ నిఫ్టి కూడా 4.5 శాతం లాభపడంతో ఇన్వెస్టర్లు ఊపిరి పీల్చుకున్నారు. సెన్సెక్స్ 2,500 పాయింట్ల మేర లాభపడి.. తిరిగి తన 74వేల మార్కును నిలబెట్టుకుంది. నిఫ్టీ 22,600 పాయింట్ల ఎగువన ముగిసింది. ఇవాళ మార్కెట్కు అదానీ పోర్ట్, ఇండస్ ఇండ్ బ్యాంక్, హిందాల్కో, టాటా స్టీల్, ఎం అండ్ ఎం అండగా నిలబ్డడాయి. నిఫ్టి అధిక వెయిటేజీ ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ వంటి షేర్లు కూడా రాణించాయి. నిఫ్టి 50లో ఎల్ అండ్ టీ, బీపీసీఎల్ నష్టాల్లో క్లోజ్ కాగా, సెన్సెక్స్లో అన్ని షేర్లూ లాభాల్లో ముగిశాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు ప్రధానంగా రాణించాయి.
రికవరీ ఎందాక?
మార్కెట్లో ఇవాళ వచ్చిన రికవరీ కొనసాగుతుందా అన్న చర్చ ఇపుడు మార్కెట్లో హాట్ టాపిక్గా మారింది. మన షేర్ల వ్యాల్యూయేషన్ అధికంగా ఉందని పలువురు విదేశీ ఇన్వెస్టర్లు అంటుండగా, దేశీయ ఇన్వెస్టర్లు మాత్రం తమ పెట్టుబడులను కొనసాగిస్తున్నారు. మార్కెట్లో రేపు వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్ ఉంది. మరి షార్ట్ కవరింగ్ ఉంటుందా? లేదా ఒత్తిడి వస్తుందా అన్నది చూడాలి. ఒకవేళ తగ్గినా.. శుక్రవారం కచ్చితంగా పెరుగుతుందని కొందరు విశ్లేషకులు అంటున్నారు. మోడీ ప్రధానిగా మూడోసారి ప్రమాణస్వీకారం చేయడాన్ని మార్కెట్ ఆహ్వానిస్తుందని వీరు అంటున్నారు. దీంతో కొత్త వీక్లీ డెరివేటివ్స్లో జోరుగా ట్రేడింగ్ జరుగుతుందని భావిస్తున్నారు. ముఖ్యంగా కేబినెట్ కూర్పు కూడా మార్కెట్పై ప్రభావం చూపే అవకాశముంది. టీడీపీ, జనతాదళ్ (యూ) కీలక బెర్త్లు అడుగుతున్నాయి. ముఖ్యంగా ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ను కొనసాగిస్తారా అన్న అనుమానం కూడా మార్కెట్లో ఉంది. బీజేపీ ఈసారి తనకు తానుగా మెజారిటీ సాధించుకోలేకపోయింది. దీంతో ఆర్థిక శాఖ ఈసారి అనుభవం ఉన్న వ్యక్తికి ఇస్తారనే టాక్ మార్కెట్లో ఉంది. సో… ఈ డెవలప్మెంట్స్ను బట్టి మార్కెట్ దిశ ఆధారపడింది. ఎల్లుండి వెలువడే ఆర్బీఐ ఎంపీసీ నిర్ణయం కూడా కీలకమే. వడ్డీ రేట్లను తగ్గించరని అంటున్నా… ఇంకేమైనా పాజిటివ్ ప్రకటనలు ఉంటాయా అని మార్కెట్ ఎదురు చూస్తోంది.