లీజుకు తిరుపతి ఎయిర్పోర్టు
దేశంలోని 11 విమానాశ్రయాలను లీజుకు ఇచ్చేందుకు కేంద్రం నిర్ణయించింది. లీజు కాలం ఏకంగా 50 ఏళ్ళు. దీనికి సంబంధించిన ప్రతిపాదనకు నిన్న పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అప్రైజల్ కమిటీ (PPPAC) ఆమోదం తెలిపింది. ఈ 11 విమనాశ్రాయలను 5 విభాగాలుగా లీజుకు ఇస్తారు. అంటే కొన్ని ఎయిర్పోర్టులను కలిపి బిడ్ చేయాల్సి ఉంటుంది. అమృత్సర్, కంగారా ఒక బండిల్ కాగా, వారణాసి, గయా, కుషినగర్ కలిసి ఒక బండిల్గా లీజుకు ఇస్తారు. భువనేశ్వర్, హుబ్లి ఒక బండిల్ కాగా, రాయపూర్, ఔరంగాబాద్, తిరుచిరాపల్లి, తిరుపతి ఎయిర్ పోర్టులను మరో బండిల్గా లీజుకు ఇస్తారు. అయితే ఒక్కో బిడ్డర్కు గరిష్ఠంగా ఎన్ని ఎయిర్పోర్టులు ఇవ్వాలనే అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటారు. ఇపుడు దేశంలో అదానీతో పాటు జీఎంఆర్ గ్రూప్లు మాత్రమే ఎయిర్పోర్టులను నిర్వహిస్తాయి. మరి ఇతర కంపెనీలు బరిలోకి దిగుతాయేమో చూడాల్సి ఉంటుంది. ఎయిపోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ మొత్తం ఎయిర్పోర్టుల లీజు వ్యవహారంలో స్పాన్సరింగ్ అండ్ ఇప్లిమెంటేషన్ ఏజెన్సీగా పనిచేయనుంది. ఇప్పటికే ఈ ప్రతిపాదనకే కేంద్ర పౌర విమానయాన శాఖ ఆమోదం తెలిపింది. ఈ ప్రక్రియకు సంబంధించి వివిధ కంపెనీల నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకుని తుది లీజు ప్రకటన చేసే అవకాశముంది. 2019లో మోడీ ప్రభుత్వం అహ్మదాబాద్, లక్నో, మంగళూరు ఎయిర్పోర్టులను అదానీ కంపెనీకి అప్పగించింది. అపుడు కూడా వీటిని 50 ఏళ్ళ లీజుకు ఇచ్చారు. 2021లో తిరువనంతపురం, గౌహతి, జైపూర్ ఎయిర్పోర్టులను కూడా ఇచ్చేశారు.
