మళ్ళీ అవే నష్టాలు…
అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం మన మార్కెట్లపై ఏమాత్రం కన్పించడం లేదు. అమెరికా, ఆసియా మార్కెట్లు ఆకర్షణీయ లాభాల్లో ఉన్నా… మన మార్కెట్లు ఓపెనింగ్లోనే 15800 దిగువకు వెళ్ళిపోయాయి. ఉదయం ఆకర్షణీయ లాభాల్లో ఉన్న సింగపూర్ నిఫ్టి క్రమంగా బలహీనపడింది. మార్కెట్ ఓపెనింగ్ సమయానికి లాభాలన్నీ పోయాయి. నిఫ్టి ఓపెనింగ్లో 15855ని తాకినా.. ఆ వెంటనే 15739ని కూడా తాకింది. ఇదంతా అయిదారు నిమిషాల్లో జరిగిపోయింది. నిఫ్టి ప్రస్తుతం 10 పాయింట్ల నష్టంతో 15771 వద్ద ట్రేడవుతోంది. బ్యాంక్ నిఫ్టి, నిఫ్టి నెక్ట్స్ గ్రీన్లో ఉన్నమాటేగాని… లాభాలు అస్సల్లేవ్. ఇక నిఫ్టి మిడ్క్యాప్ ఏకంగా అర శాతంపైగా నష్టపోయాయి. అదానీ డీల్ తరవాత అనేక సిమెంట్ కంపెనీల షేర్లు నష్టాల్లో ఉన్నాయి. అదానీల డీల్ తరవాత త్వరలోనే ఏసీసీ, గుజరాత్ అంబుజాకు ఓపెన్ ఆఫర్ రానుంది. ఇపుడు ఏసీసీ 6 శాతం దాకా లాభంతో రూ.2231 వద్ద ట్రేడవుతోంది. అంబుజా సిమెంట్ మాత్రం రెండు శాతం లాభంతో రూ. 365.70 వద్ద ట్రేడవుతున్నాయి.
