భారీ నష్టాల్లో సింగపూర్ నిఫ్టి
అమెరికా ఫెడ్ ఛైర్మన్ పావెల్ రాత్రి చేసిన కామెంట్లు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లను కుదిపేశాయి. మే నెలలోనే 0.5 శాతం మేర వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఆయన రాత్రి మాట్లాడిన తీరు చూస్తుంటే… అమెరికా వడ్డీ రేట్లను చాలా తొందరగా పెంచుతుందని స్పష్టమౌతోంది. దీంతో రాత్రి అమెరికా పదేళ్ళ ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ 2.95 శాతానికి చేరాయి. దీంతో నిన్న ఆరంభంలో 0.5 శాతంపైగా లాభాల్లో ఉన్న వాల్స్ట్రీట్ సూచీలన్నీ భారీ నష్టాలతో ముగిశాయి. నాస్డాక్ రెండు శాతం, ఎస్ అండ్ పీ 500 ఒకటిన్నర శాతం, డౌజోన్స్ ఒక శాతం మేర నష్టపోయాయి. డాలర్ స్థిరంగా ఉన్నా.. నిన్న వచ్చిన నిరుద్యోగ డేటా చూస్తుంటే…అమెరికా వృద్ధిరేటు చాలా ఫాస్ట్గా సాగుతోంది. దీంతో వడ్డీ రేట్లను తొందరగా పెంచాలని ఫెడ్ భావిస్తోంది. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు కూడా వాల్స్ట్రీట్కు స్పందిస్తున్నాయి. జపాన్ నిక్కీ 1.89 శాతం క్షీణంచగా, ఆస్ట్రేలియా మార్కెట్ కూడా అలాగే స్పందించింది. చైనా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నా.. హాంగ్సెంగ్ ఒక శాతంపైగా నష్టంతో ఉంది. సింగపూర్ నిఫ్టి ఇపుడు 200 పాయింట్ల నష్టంతో ఉంది. మరి ట్రేడింగ్ ప్రారంభమయ్యే సమయానికి నష్టాలు తగ్గుతాయా? లేదా ఇదే స్థాయిలో నిఫ్టి ప్రారంభమౌతుందేమో చూడాలి.