For Money

Business News

18600 వద్ద ముగిసిన నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్లు ఉరకలు పెడుతుండగా, మన మార్కెట్లు కూడా అదే ఉత్సాహంతో ప్రారంభమయ్యాయి. అయితే అధిక స్థాయిల వద్ద నిలబడలేకపోయాయి. నిఫ్టి ఓపెనింగ్‌లో ఆకర్షణీయ లాభాల్లో ఉన్నా… వెంటనే వచ్చిన లాభాల స్వీకరణ కారణంగా18581 కనిష్ఠస్థాయిని తాకాయి. అయితే అక్కడి నుంచి కోలుకున్న నిఫ్టి ఇవాళ్టి గరిష్ఠ స్థాయి18641ని తాకాయి. అయితే రెండు గంటల ప్రాంతంలో వచ్చిన అమ్మకాల ఒత్తిడి కారణంగా నిఫ్టి చాలా వరకు లాభాలను కోల్పోయింది. చివరికి 99 పాయింట్ల లాభంతో 18598 వద్ద ముగిసింది. సెనసెక్స్‌ కూడా 344 పాయింట్ల లాభంతో 62846 వద్ద ముగిసింది. నిఫ్టిలో ఆటో షేర్ల హవా కొనసాగుతోంది. ఇవాళ ఎం అండ్‌ ఎం 3.37 శాతం లాభంతో టాప్‌ గెయినర్‌గా నిలిచింది. టైటాన్‌, కోల్‌ ఇండియా, టాటా స్టీల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేర్లు 1.5 శాతం పైగా లాభంతో ఉన్నాయి. ఇక నష్టాల్లో ఉన్న షేర్లలో ఓఎన్‌జీసీ టాప్‌లో ఉంది. కంపెనీ ఫలితాలు బాగా లేకపోవడంతో ఈ షేర్లలో ఒత్తిడి పెరిగింది. 3 శాతం నష్టంతో ఈ షేర్‌ రూ. 159 వద్ద ముగిసింది. నిజానికి బ్యాంక్‌ నిఫ్టి ఇవాళ ఆల్‌ టైమ్‌ హైని తాకింది. ఈ సూచీ 44483ని తాకిన తరవాత 44311 వద్ద ముగిసింది. ఈ సూచీతో పాటు నిఫ్టి నెక్ట్స్‌ కూడా అర శాతంపైగా లాభంతో ముగిశాయి. నిఫ్టి మిడ్‌ క్యాప్‌ సూచీ మాత్రం 0.25 శాతం లాభానికే పరిమితమైంది. అదానీ షేర్లలో అదానీ టోటల్‌ 4 శాతంపైగా నష్టంతో ముగిశాయి.