బ్యాంకింగ్ షేర్లు కొనొద్దు… టైమ్ వేస్ట్
బ్యాంకు షేర్లు కొని, ధర కోసం ప్రతిరోజూ పేపర్ చూసుకోవడం వేస్ట్ అని ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ శంకర్ శర్మ అంటున్నారు. ఆ మాటకొస్తే లార్జ్ క్యాప్ షేర్ల జోలికి వెళ్ళొద్దని ఆయన సలహా ఇస్తున్నారు. ఎకనామిక్ టైమ్స్లో ఆయన ఇంటర్వ్యూ వచ్చింది. స్మాల్ క్యాప్లో చాలా షేర్లు ఉన్నాయని… చాలా వరకు యాక్షన్ అక్కడే ఉందని ఆయన అన్నారు. ఐటీసీ, హెచ్యూఎల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వంటి లార్జ్ క్యాప్ షేర్లను పట్టించుకోవడం అనవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది నిఫ్టి దాదాపు ఇపుడున్న స్థాయిలోనే అటూ ఇటూ కొనసాగవచ్చని… కొత్త గరిష్ఠ స్థాయి అనుమానమేనని అన్నారు. కన్జూమర్ గూడ్స్ కంపెనీలు కూడా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని ఆయన చెప్పారు. ముడిపదార్థాల ధరలు గణనీయంగా పెరిగిందని, కాని అధిక ధర చెల్లించేందుకు కస్టమర్ రెడీగా లేడని.. దీంతో అనేక కంపెనీలు మార్జిన్లు తగ్గనున్నాయని ఆయన చెప్పారు. కమాడిటీ మార్కెట్ ర్యాలీ కూడా ఇక ఎంతో కాలం కొనసాగదని అన్నారు. ఇప్పటికే రెండేళ్ళ నుంచి ఈ రంగంలో ర్యాలీ కొనసాగుతోందని.. నాలుగైదు నెలల్లో ఈ ర్యాలీకి బ్రేక్ పడొచ్చని అన్నారు. నిఫ్టి బదలు ఇన్వెస్టర్లు మంచి షేర్లను ఎంపిక చేసుకోవడం బెటర్ అని ఆయన సలహా ఇచ్చారు.ఈవీ మార్కెట్ పెరగడం ఖాయమని అన్నారు. ఇందులో చర్చకు ఛాన్స్ లేదన్నారు. లార్జ్ క్యాప్స్లో కేవలం ఐటీ కంపెనీల షేర్లకే పెరిగే ఛాన్స్ ఉందని అన్నారు. అయితే కొత్త పాత తరం టెక్ కంపెనీలవైపే శంకర్ శర్మ మొగ్గు చూపారు. ఎలక్ట్రిక్ వాహనాలకు ముడి భాగాలు తయారు చేసే కంపెనీలు, టెక్ రంగంలోకి కొన్ని షేర్లలో పెట్టుబడి పెట్టవచ్చని ఆయన అన్నారు.