ఇక ఉపగ్రహాలు ప్రయోగించం: ఇస్రో
రక్షణ విభాగం తరవాత స్పేస్ విభాగం కూడా క్రమంగా ప్రైవేట్ కంపెనీల చేతిలో వెళ్ళనుంది. ఇక నుంచి తాము ఉపగ్రహాలను ప్రయోగించడం లేదని ఇస్రో ఛైర్మన్ పవన్ గోయెంకా స్పష్టం చేశారు. ఉపగహ్రాల నిర్మాణం కూడా తాము చేయమని అన్నారు. ఈ రెండూ ఇక నుంచి ప్రైవేట్ రంగానికి అప్పగిస్తామని ఆయన స్పష్టం చేశారు. రీసెర్చి, సైంటిఫిక్ మిషన్స్, అడ్వాన్స్ స్పేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలపై తాము దృష్టి కేంద్రీకరిస్తామని ఇస్రో ఛైర్మన్ తెలిపారు. శాటిలైట్ల తయారీని క్రమంగా ప్రైవేట్కు అప్పగిస్తామన్నారు. ఇప్పటికే ఈ ప్రక్రియ దిశగా యత్నాలు మొదలయ్యాయని అన్నారు. ప్రైవేట్ రంగం చేయలేని రీసెర్చి, స్పేస్ ఇన్ఫ్రాలపై తాము దృష్టి పెడతామని ఆయన అన్నారు. ఢిల్లీలో జరిగిన బిజినెస్ టుడే @100 ఎకనామిక్ సమ్మిట్లో ఆయన మాట్లాడారు. SSLV వంటి చన్ని ఉపగ్రహాల టెక్నాలజీ, ఉత్పత్తి హక్కులను ఇప్పటికే హిందుస్థాన్ ఏరోనాటిక్స్కు తాము అప్పగించామని అన్నారు. పీఎస్ఎల్వీతో పాటు అత్యంత పవర్ ఫుల్ ఆపరేషనల్ రాకెట్ అయిన లాంచ్ వెహికల్ మార్క్ – 3ని కూడా ప్రైవేట్ రంగానికి అప్పగించేస్తామని అన్నారు. ఇస్రో నుంచి ఇప్పటికే 120 రకాల టెక్నాలజీలను తాము ప్రైవేట్ రంగానికి అప్పగించేశామని అన్నారు. అలాగే ప్రైవేట్ రంగంలోనే ఉపగ్రహ ప్రయోగ కేంద్రాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని అన్నారు. ఇప్పటికే 31 శాటిలైట్స్ తయారీ ఆర్డర్లను ప్రైవేట్ కంపెనీలకు రక్షణ శాఖ అప్పగించిందన్నారు.
