LPG: పరిస్థితి ఆందోళనకరం
దేశంలో ఎల్పీజీ సరఫరా సాధారణంగా ఉన్నప్పటికీ, పరిస్థితి పరిస్థితి ‘ఆందోళనకరంగా’ ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. సాధ్యమైనంత వరకు వినియోగదారులు పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG)కి మారాలని సూచించింది. భయాందోళనలతో బుకింగ్ చేయడాన్ని నివారించాలని, ఈ మేరకు పర్యవేక్షణను కట్టుదిట్టం చేయాలని రాష్ట్రాలను కోరింది. రోజువారీ మీడియా సమావేశంలో పెట్రోలియం కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడారు. ఎల్పిజి వినియోగంపై ఒత్తిడిని తగ్గించడానికి 13,700కు పైగా పిఎన్జి కనెక్షన్లు విడుదల చేసినట్లు తెలిపారు. ఆన్లైన్ బుకింగ్లు 93 శాతానికి పెరిగాయని, గురువారం సుమారు 55 లక్షల రీఫిల్ రిక్వెస్ట్లు వచ్చినట్లు ఆమె తెలిపారు. డిమాండ్ అధికంగా ఉన్నప్పటికీ బుకింగ్ సాధారణ స్థాయికి చేరిందన్నారు. భయాందోళనలతో బుకింగ్ చేసేవారి సంఖ్య తగ్గుముఖం పట్టిందన్నారు. విద్యాసంస్థలు, ఆసుపత్రులకు కేటాయించిన వాణిజ్య ఎల్పీజీ కేటాయింపుల్లో సుమారు 50 శాతం అందుతోందని సుజాత శర్మ తెలిపారు. అథెంటికేషన్ కోడ్ ద్వారా డెలివరీ జరుగుతోందని, దీంతో గాభరాతో బుకింగ్ చేసేవారి సంఖ్య తగ్గిందన్నారు. గత వారంలో సుమారు 11,300 టన్నుల వాణిజ్య ఎల్పీజీని వినియోగదారులకు అందించామని అన్నారు.
