నష్టాలతో ప్రారంభం కానున్న నిఫ్టి
అమెరికా ఫెడరల్ రిజర్వ్ రాత్రి స్టాక్ మార్కెట్లకు షాక్ ఇచ్చింది. ఒకవైపు అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇంకా కోలుకోవాల్సి ఉందని అంటూనే… 2023కల్లా రెండు సార్లు వడ్డీరేట్లు పెంచుతామని ప్రకటించింది. ఉద్దీపన ప్యాకేజీ కొనసాగుతుందని చెబుతూ…ఈ హచ్చరిక చేయడంతో ఇన్వెస్టర్లలో టెన్షన్ మొదలైంది. బాండ్ ఈల్డ్స్ పెరగడం, డాలర్ పెరగడంతో షేర్ మార్కెట్ ఇన్వెస్టర్లు తమ వ్యూహం మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. డాలర్ పెరగడం, క్రూడ్ ఆశించిన స్థాయిలో తగ్గకపోవడంతో… భారత వంటి మార్కెట్లకు తీవ్ర ఇబ్బందులు ఉండే అవకాశముంది. ఇపుడు భారత మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల ఆసక్తి కీలకంగా మారింది. రాత్రి అమెరికా మార్కెట్లు ఒక మోస్తరు నష్టాలతో క్లోజయ్యాయి. డౌజోన్స్ 0.7 శాతం క్షీణించగా ఎస్ అండ్ పీ 500 సూచీ 0.54 శాతం క్షీణించింది. ఐటీ షేర్ల సూచీ నాస్డాక్ కేవలం 0.24 శాతం నష్టంతో ముగిసింది. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. చైనా మాత్రం గ్రీన్లో ఉంది.జపాన్ నిక్కీ ఒక శాతంపైగా నష్టపోయింది. హాంగ్సెంగ్ స్థిరంగా ఉండటం విశేషం. సింగపూర్ నిఫ్టి వంద పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. నిఫ్టి కూడా నష్టాలతో ప్రారంభం కానుంది.