ఫలితాలు సూపర్… ఏడీఆర్ డౌన్

మార్చితో ముగిసిన త్రైమాసికంలో విప్రో కంపెనీ రూ.3,569.6 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదేకాలంతో పోలిస్తే కంపెనీ నికర లాభం 25.9 శాతం పెరిగింది. అదే సమయంలో కంపెనీ టర్నోవర్ రూ.22,208.3 కోట్ల నుంచి రూ.22,504.2 కోట్లకు అంటే సుమారు ఒక శాతం మేర పెరిగిందని కంపెనీ వెల్లడించింది. అదే పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ నికర లాభం 18.9 శాతం పెరిగి రూ.13,135 కోట్లకు చేరగా, టర్నోవర్ స్వల్పంగా తగ్గింది. కంపెనీ ఉద్యోగుల సంఖ్య 2,32,614 నుంచి 2,33,346కి పెరిగింది. ఒక్కో షేరుకు రూ.6ల మధ్యంతర డివిడెండ్ను కంపెనీ ప్రకటించింది.
ఏడిఆర్ డౌన్
అయితే అమెరికా మార్కెట్ మాత్రం కంపెనీ ఫలితాల పట్ల నిరాశ వ్యక్తం చేసింది. ఓపెనింగ్ కంపెనీ ఏడీఆర్ 7 శాతం క్షీణించి 2.63 డాలర్లకు చేరింది. ఇపుడు 2.66 శాతం నష్టంతో 2.745 డాలర్ల వద్ద ట్రేడవుతుంది. నాస్డాక్ ఏకంగా రెండు శాతం క్షీణించడంతో ఐటీ, టెక్ షేర్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం కన్పిస్తోంది. నాస్డాక్ కోలుకుంటే విప్రో షేర్ కూడా నష్టాలను పూడ్చుకునే ఛాన్స్ ఉంది.