గోల్డ్ కంపెనీల షేర్లు ఢమాల్
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు దూసుకుపోతున్నాయి. డాలర్ స్థిరంగా ఉన్నా… బులియన్ ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న వార్తలతో బులియన్కు డిమాండ్ పెరుగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 2150 డాలర్లను దాటగా.. మన ఎంసీఎక్స్లో పది గ్రాములు ధర రూ. 65,000లను దాటింది. బంగారం ధర భారీగా పెరగడంతో… డిమాండ్ తగ్గే అవకాశం ఉందనే వార్తలతో జువెలరీ కంపెనీల షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వస్తోంది. పీసీ జువల్లర్స్ వంటి వీక్ కౌంటర్స్లో అమ్మకాల హోరు అధికంగా ఉంది. ఈ షేర్ 5 శాతం లోయర్ సర్క్యూట్ను తాకింది. గోల్డయామ్ ఇంటర్నేషనల్ షేర్ 4 శాతం క్షీణించగా.. కళ్యాణ్ జువలర్స్, త్రిభువన్ భీమ్జీ జవేరీ, ఆర్బీజడ్ జువల్స్ షేర్లు రెండు నుంచి 3 శాతం మేర నష్టపోయాయి. టైటాన్ కూడా అర శాతం నష్టపోయింది.