మత విభజన మన ఐటీని దెబ్బతీస్తుంది
కర్ణాటకలో పెరుగుతున్న మతపరమైన వైషమ్యాల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన హెచ్చరిక నిజం అవుతోంది. మతపరమైన గొడవలు మొదలైతే.. ఆ రాష్ట్రానికి పెట్టుబడులు రావని ఆయన హెచ్చరించారు. ఇపుడు కర్ణాటక రాష్ట్రంలో పరిస్థితిపై ఆ రాష్ట్రానికి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త బయోకాన్ అధినేత ఇదే హెచ్చరిక ఆ రాష్ట్ర సీఎంకు చేశారు.
కర్ణాటకలోని దేవాలయాల పరిసర ప్రాంతాల్లో ముస్లిం వ్యాపారస్థులు ఉండటానికి వీల్లేదని ఆ రాష్ట్రంలోని అనేక దేవాలయాల కమిటీలు ప్రకటిస్తున్నాయి. దీనికి సంబంధించిన మీడియాలో వచ్చిన వార్తలను ప్రముఖ పారిశ్రామికవేత్త, బయోకాన్ అధినేత కిరణ్ మజుందార్ షా స్పందించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైను ట్యాగ్ చేస్తూ… రాష్ట్రంలో మతపరంగా పెరుగుతున్న విభజన విషయంలో ముఖ్యమంత్రి చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు. అన్ని వర్గాల ఆర్థిక అభివృద్ధి సాధించడంలో కర్ణాటక ఎపుడూ ముందుంది. ఇలాంటి మతపరమైన విభజనకు మన అనుమతించరాదు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ రంగాల్లో అంతర్జాతీయంగా కర్ణాటక నాయకత్వం వహిస్తోందని… రాష్ట్రంలో ఇలాంటి మతపరమైన విభజన వస్తే మన నాయకత్వం దెబ్బతింటుందని ఆమె హెచ్చరించారు. వెంటనే ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలని కోరారు.