PM CARES: దాచుకోవడానికా?
కోవిడ్ సమయంలో పీఎం కేర్స్ ఫండ్ కొన్ని వేల కోట్లు వసూలు చేసినా… ప్రజల కోసం ఖర్చు చేయలేదని తేలింది. 2024-25 ఏడాదికి PM CARES ఫండ్స్ వివరాలు ఇవాళ వెల్లడి అయ్యాయి. ఈ ఫండ్ కోసం వివిధ సంస్థలు, వ్యక్తుల నుంచి రూ.8,452 కోట్లు వచ్చాయి. ఎంతో ఆర్భాటంగా ప్రచారం చేసిన PM Cares for Children Scheme కింద కేవలం 0.001 శాతం మాత్రమే నిధులు వెచ్చించారు. 2024-25లో ఈ స్కీమ్ కింద రూ. 88 లక్షలు ఖర్చు పెట్టినట్లు వెల్లడించారు. 2021లో ఈ స్కీమ్ను ప్రారంభించారు. ఇందులో భాంగా కోవిడ్ సమయంలో తలిదండ్రులు కోల్పోయిన పిల్లలకు ఏటా రూ. 20,000 స్కాలర్షిప్ ఇస్తామని ప్రకటించారు. అలాగే ప్రతి నెలా రూ. 1000 స్టయిఫండ్, రూ. 8000 వార్షిక అలవెన్స్ ఇస్తామన్నారు.ఈ అలవెన్స్ పిల్లల స్కూలు ఫీజుల, పుస్తకాలు, యూనిఫామ్, షూల కోసం వెచ్చించాలని అన్నారు. అలాగే ఈ పిల్లల వయసు 18 ఏళ్ళు కాగానే రూ. 10 లక్షలు ఇస్తామని కూడా అన్నారు. అయితే PM Cares for Childeren స్కీమ్ కింద కేవలం 4543 దరఖాస్తులను మాత్రమే ఆమోదించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ స్కీమ్ కింద 2023 ఆర్థిక సంవత్సరంలో రూ. 346 కోట్లు ఖర్చు చేయగా, 2024లో రూ. 15 కోట్లు ఖర్చు పెట్టారు. అయితే 2025 ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం రూ. 88 లక్షలకు పడిపోయింది. 2024-25లో 3,383 మంది పిల్లలకు ఈ స్కీమ్ వర్తింప చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. వచ్చిన 2024 మార్చి నెలాఖరున నిధుల్లో ఏకంగా రూ. 6,641 కోట్లను ఫిక్సెడ్ డిపాజిట్లలో పెట్టారు. దీనిపై ఇప్పటి వరకు రూ. 469 కోట్ల వచ్చినట్లు తెలిపారు. చిత్రమేమిటంటే ఇంతకన్నా ఎక్కువ మొత్తం విరాళాల రూపంలో రావడం. 2025లో రూ. 479 కోట్లు విరాళంగా రాగా, రూ. 325 కోట్లను వెనక్కి ఇచ్చాయి. ఖర్చు కోసం ఇచ్చిన నిధులు కూడా వెచ్చించకుండా వెనక్కి ఇచ్చేశారన్నమాట. 2025 మార్చి నాటికి ఫిక్సెడ్ డిపాజిట్ల రూపంలో ఉంచిన మొత్తం రూ. 7847 కోట్లు దాటింది. ఈ మొత్తం వ్యవహారం ఇవాళ జాతీయ స్థాయిలో హాట్ టాపిక్గా మారింది. నిధులు ఎవరు ఇచ్చారు? ఎలా ఖర్చు చేశారు? ఎందుకు మొత్తం నిధులు ఖర్చు పెట్టలేదో వివరించాలన్న డిమాండ్లు వస్తున్నాయి.
