రాజీకి రాకపోతే… దాడి తీవ్రం చేస్తాం
ఇరాన్లో తమ లక్ష్యం పూర్తి కావొస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇవాళ ఆయన వాషింగ్టన్లోని క్రాస్ హాల్ నుంచి అమెరికా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఇరాన్ ఇక కోలుకోని విధంగా తాము దెబ్బతీశామన్నారు. ఇరాన్ నేవీ, ఎయిరఫోర్స్, మిస్సైల్స్ తయారీని పూర్తిగా దెబ్బతీశామని పేర్కొన్నారు. ఇరాన్ రాజీకి రావాలని, లేని పక్షంలో దాడి మరింత తీవ్రం చేస్తామని అన్నారు. రెండు, మూడు వారాల్లో యుద్ధం ముగిస్తామని హెచ్చరించారు.గత 47 ఏళ్ళుగా అమెరికాను ఇరాన్ బెదిరిస్తోందని, ఇక ఏమాత్రం అమెరికా మాట ఇరాన్ ఎత్తలేదన్నారు. ఒక పద్ధతి ప్రకారం ఇరాన్ను సర్వనాశనం చేశామని అన్నారు. యుద్ధంలో చనిపోయిన 13 మంది అమెరికన్ సైనికులకు ఆయన నివాళి అర్పించారు. మాకు చమురు అక్కర్లేదు విదేశాల నుంచి తమ దేశానికి ఆయిల్ అక్కర్లేదని ట్రంప్ అన్నారు. ఆయిల్ కోసం ఇరాన్పై దాడి చేస్తోందన్న వాదనలను ఆయన పరోక్షంగా తోసిపుచ్చుతూ… తమ వద్ద భారీగా ఆయిల్ ఉందని, ఇతర దేశలకు అమ్మేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఇప్పటికైనా ఆయిల్ కావాల్సిన దేశాలు హార్ముజ్ జలసంధిని ఇరాన్ నుంచి కాపాడాలని కోరారు. అందరికీ అందుబాటులో ఉండేలా, స్వేచ్ఛగా ఆ జలసంధి ద్వారా నౌకలు వెళ్ళేలా చూడాలని అన్నారు. అమెరికా యుద్ధం చేసినందున…ఆ మేరకు భారం ప్రజలపై ఉంటుందని, త్వరలోనే వారిని ఆదుకుంటామని అన్నారు. యుద్ధం ముగిసేనాటికి అమెరికా ప్రజలకు మరింత సురక్షితంగా, మరింత ఐశ్వర్యవంతులుగా ఉంటారని ఆయన భరోసా ఇచ్చారు. ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా గొప్పగా ఉంటారని ట్రంప్ అన్నారు.
