భారీ నష్టాల్లో…

మార్కెట్ ఇవాళ భారీ నష్టాల్లో ప్రారంభమైంది. రాత్రి అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించినా… 2025లో కేవలం రెండు సార్లు మాత్రమే వడ్డీ తగ్గింపులు ఉంటాయని స్పష్టం చేసింది. దీంతో రాత్రి వాల్స్ట్రీట్ భారీ నష్టాల్లో ముగిసింది. వాల్స్ట్రీట్ మరో పది శాతం వరకు నష్టపోతుందని వార్తలు వస్తుండటంతో మన మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలోనే నిఫ్టి 23870ని తాకింది. అక్కడి నుంచి స్వల్పంగా కోలుకుని 23,913 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి ఇపుడు 285 పాయింట్ల నష్టంతో ఉంది. మరోవైపు ఫారెక్స్ మార్కెట్లో డాలర్తో రూపాయి పతనం జోరందుకుంది. చరిత్రంలో తొలిసారి రూపాయి విలువ 85 దిగువకు పడిపోయింది. ఇపుడు 85 రూపాయలు ఇస్తే గాని ఒక డాలర్ వచ్చే స్థితిలో లేదు. ఇది స్పాట్ మార్కెట్ రేటు. ఫ్యూచర్స్లో మరింత పతనమైంది. రూపాయి పతనం వల్ల ఫార్మా, ఐటీ రంగాలకు లాభాల పంట పండనుంది. రాత్రి నాస్డాక్ భారీ అమ్మకాల కారణంగా మన దేశంలో ఐటీ షేర్లు పడ్దాయి. అయితే ఫార్మా మాత్రం గ్రీన్లో ఉంది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ టాప్ గెయినర్గా ఉంది. సన్ ఫార్మా నామమాత్రపు నష్టాల్లో ఉంది.