25,000 స్థాయి సేఫ్
ఇవాళ ఉదయం కోలుకున్నట్లే కన్పించిన నిఫ్టికి క్రూడ్ భారీ దెబ్బతీసింది. ఉదయం నష్టాల్లోకి జారుకున్నా… కోలుకుని 25,485 స్థాయిని తాకింది. కాని మిడ్ సెషన్ సమయంలో బ్రెంట్ క్రూడ్ 78 డాలర్లను దాటిందన్న వార్తలతో నిఫ్టి కేవలం పదిహేను నిమిషాల్లో మొత్తం లాభాలను కోల్పోయి నష్టాల్లోకి జారుకుంది. చాలా మంది ఇన్వెస్టర్లు తేరుకుని సర్దుకునే లోగానే జరగాల్సిన నష్టం జరిగింది. ఆ తరవాత నిఫ్టి ఏ దశలోనూ కోలుకోలేదు. చివర్లో నిఫ్టి 25000 స్థాయిని కూడా కోల్పోయింది. ఎట్టకేలకు 25049 పాయింట్ల వద్ద 200 పాయింట్ల నష్టంతో ముగిసింది. సెన్సెక్స్ 808 పాయింట్ల నష్టంతో క్లోజైంది. ఒక్క ఐటీ రంగం తప్ప మిగిలిన అన్ని రంగాల్లో అమ్మకాల ఒత్తిడి కన్పించింది. ముఖ్యంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, రియాల్టీతో పాటు ఎఫ్ఎంసీజీ రంగాలకు చెందిన షేర్లలో ఒత్తిడి అధికంగా ఉంది. అలాగే ఎన్బీఎఫ్సీలలో కూడా అమ్మకాల జోరు అధికంగా ఉంది. నిఫ్టి 0.8 శాతం నష్టపోగా స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ సూచీలు ఒక శాతంపైగా నష్టపోయాయి. నిఫ్టిలో ఇన్ఫోసిస్ ఒకటిన్నర శాతం లాభంతో టాప్ గెయినర్గా నిలిచింది. తరవాతి స్థానాల్లో ఓఎన్జీసీ, హెచ్డీఎఫ్సీ లైఫ్, టాటా మోటార్స్, విప్రో షేర్లు ఉన్నాయి. ఇక నిఫ్టి లూజర్స్లో ఎం అండ్ ఎం 3.54 శాతం క్షీణించింది. తరువాతి స్థానాల్లో ఉన్న బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, నెస్లే, బీపీసీఎల్ షేర్లు రెండు శాతంపైగా నష్టపోయాయి.