స్మాల్ క్యాప్… బిగ్ ఫాల్

మార్కెట్ పూర్తిగా డే ట్రేడర్స్ చేతిలోకి వెళ్ళిపోయింది. పొజిషనల్ ట్రేడర్స్ పూర్తిగా దూరమవుతున్నారు. ప్రతి రోజు నిఫ్టిపై ట్రేడ్ చేసి డబ్బు సంపాదిస్తున్నారు డే ట్రేడర్స్. కాబట్టి కేవలం ఇన్వెస్ట్మెంట్కే పరిమితం కాకుండా ట్రేడింగ్ అనుభవం గడించిన ఇన్వెస్టర్లకు ప్రస్తుతం మార్కెట్ భారీ రిటర్న్స్ ఇస్తోంది. నిఫ్టి ఇవాళ తీవ్ర స్థాయిలో హెచ్చుతగ్గులకు లోనైంది. ఉదయం నష్టాల్లోకి జారుకున్న నిఫ్టి 23347 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది మిడ్సెషన్కు ముందు. ఆ తరవాత వచ్చిన లాభాల స్వీకరణ కారణంగా నిఫ్టి 23050ని కూడా తాకింది. అంటే అధిక స్థాయిలో షార్ట్ చేసిన ఇన్వెస్టర్ల పంట పండింది. చివరలో స్వల్ప రికవరీ కన్పించినా.. 40 పాయింట్లకు పరిమితమైంది. క్రిత ముగింపుతో పోలిస్తే నిఫ్టి 113 పాయింట్ల నష్టంతో 23092 వద్ద ముగిసింది. నిఫ్టిలో 31 షేర్లు నష్టాల్లో క్లోజ్ కాగా, ఇవాళ ట్రేడైన షేర్లలో (2891) 2183 షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఇవాళ నిఫ్టి నెక్ట్స్ సూచీ 1.58 శాతం నష్టపోయింది. నిఫ్టిలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ టాప్ లూజర్ కాగా, రెండో స్థానంలో ఉన్న ట్రెంట్ నాలుగు శాతంపైగా నష్టపోయింది. నిఫ్టి నెక్ట్స్లో జియో ఫైనాన్స్, హావెల్స్, ఆర్ఈసీ, పీఎఫ్సీ, డీఎల్ఎఫ్ షేర్లు భారీ నష్టాలతో ముగిశాయి.