నిఫ్టి లాభాలను నమ్మొచ్చా?
వరుసగా రెండో రోజు నిఫ్టి లాభాల్లో ముగిసింది. డాలర్ బలంగా ఉన్నా, క్రూడ్ పెరిగినా… మన మార్కెట్లో సూచీలు ఆకర్షణీయ లాభాలు గడించాయి. నిఫ్టి 172 పాయింట్లు, సెన్సెక్స్ 568 పాయింట్ల లాభంతో ముగిశాయి. ఓవరాల్ మార్కెట్ బ్రెడ్త్ పాజిటివ్గా ఉంది. నిఫ్టి ప్రధాన షేర్లలో అధిక యాక్షన్ ఉంది. అయితే ఇవాళ చాలా పాజిటివ్ అంశం ఏమిటంటే… మిడ్క్యాప్ షేర్లు చాలా రోజుల తరవాత ఒక మోస్తరు లాభాలతో ముగియడం. రంగాలవారీగా చూస్తే నిఫ్టి ఐటీ, నిఫ్టి ఎఫ్ఎంసీజీలు ఒక శాతం దాకా నష్టంతో ముగిశాయి. ఇక మెటల్స్, ఆటో, క్యాపిటల్ మార్కెట్, రియాలిటీ, నిఫ్టి డిఫెన్స్ సూచీలు రెండు శాతం లాభాలతో ముగిశాయి. అంటే ఇటీవల భారీగా తగ్గిన ఈ షేర్లకు దిగువస్థాయిలో మద్దతు లభించిందన్నమాట. ఇవాళ 1831 షేర్లు గ్రీన్లో క్లోజ్ కాగా, 1192 షేర్లు నష్టాల్లో ముగిశాయి. అయితే ఈ పుల్ బ్యాక్ రేపు కూడా కొనసాగుతుందా అన్న ప్రశ్నకు టెక్నికల్ అనలిస్టుల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వస్తున్నాయి. భారీ నష్టాలతో తరవాత మార్కెట్లో పుల్ బ్యాక్లో కొనసాగుతుందని కొందరు అంటుండగా, మరికొందరు మాత్రం కొనుగోలు చేసే ముందు ఇంకాస్త ఆగాలని అంటున్నారు. తొందరపడి కొంటే… భారీగా నష్టపోయే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. అయితే దీర్ఘ కాలిక ఇన్వెస్టర్లు మాత్రం అంటే అయిదేళ్ళ వరకు వెయిట్ చేసే ఇన్వెస్టర్లు క్రమంగా ఇపుడు కొనుగోలు చేయొచ్చని అంటున్నారు.
