24,500…ఇంకెంత దూరం?

మార్కెట్ ఇవాళ తీవ్రస్థాయిలో హెచ్చుతగ్గులకు లోనైంది. ఆరంభంలో బాగానే ఉన్నా మిడ్ సెషన్ లోపల లాభాలన్నీ కోల్పోయి 24366ని తాకింది. అక్కడి నుంచి కోలుకుని ఒక మోస్తరు లాభాలు పొందినా.. చివర్లో మరో రెండు సార్లు నష్టాల్లోకి జారింది. పడిన ప్రతిసారీ దిగువన మద్దతు లభిస్తోంది. ముఖ్యంగా ఎల్లుండి ఆర్బీఐ పరిపతి విధాన ప్రకటన ఉండటం, వడ్డీరేట్లను ఈసారి తగ్గిస్తారనే అంచనాలతో మార్కెట్ నిలబడుతోంది. ముఖ్యంగా బ్యాంక్ షేర్లు ఇవాళ నిఫ్టికి అండగా నిలబడ్డాయి. నిఫ్టి అధిక వెయిటేజీ ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభాల కారణంగా నిఫ్టి లాభాల్లో ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 10 పాయింట్ల లాభంతో 24467 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ 110 పాయింట్లు లాభపడింది. ఇవాళ ఎన్ఎస్ఈలో 2877 షేర్లు ట్రేడవగా 1699 షేర్లు లాభాల్లో ముగిశాయి. 1103 షేర్లు నష్టాల్లో క్లోజయ్యాయి. నిఫ్టిలో హెచ్డీఎఫ్సీ లైఫ్ టాప్ గెయినర్గా నిలిచింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, అపోలో హాస్పిటల్స్, ఎన్టీసీపీ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక నిఫ్టి షేర్లలో నష్టపోయిన వాటిలో భారతీ ఎయిర్టెల్ టాప్లో ఉంది. సిప్లా, బజాజ్ ఆటో, టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్ తరవాతి స్థానాల్లో ఉన్నాయి. ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాతో పీఎస్యూ బ్యాంక్ షేర్ల సూచీ రెండు శాతంపైగా లాభంతో ముగిసింది.