ఇవాళ ఆదుకున్నదెవరు?

నిఫ్టి ఇవాళ గ్రీన్లో ముగిసినట్లు కన్పించినా… గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన పలు షేర్లలో ఇవాళ లాభాల స్వీకరణ కన్పించింది. 25000పైన నిఫ్టి ముందుకు సాగడం కష్టంగా మారింది. బ్యాంక్ నిఫ్టి కూడా కన్సాలిడేషన్ మూడ్లోకి వెళ్ళడంతో నిఫ్టికి పై స్థాయిలో ఒత్తిడి వస్తోంది. ఇవాళ ఉదయం నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చిన నిఫ్టి ఒకదశలో 25222 స్థాయిని తాకింది. కాని ఆ తరవాత వచ్చిన లాభాల స్వీకరణ కారణంగా 25081 పాయింట్లకు పడిపోయింది. తరవాత స్వల్పంగా కోలుకుని 37 పాయింట్ల లాభంతో 25141 పాయింట్ల వద్ద ముగిసింది. ముఖ్యంగా ఇటీవల బాగా పెరిగిన మిడ్, స్మాల్ క్యాప్ షేర్లలో లాభాల స్వీకరణ మార్కెట్లో స్పష్టంగా కన్పిస్తోంది. ఇవాళ ఐటీ నిఫ్టి సూచీలో బలం లేకుంటే నిఫ్టి భారీ నష్టాలతో ముగిసేది. గత కొన్ని వారాలుగా అప్ ట్రెండ్లో ఉన్న డిఫెన్స్ కౌంటర్లలో కూడా ఒత్తిడి కన్పిస్తోంది. ఇవాళ 2995 షేర్లు ట్రేడవగా 1608 షేర్లు గ్రీన్లో, 1304 షేర్లు రెడ్లో ముగిశాయి. నిఫ్టి 50లో హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, విప్రో, ఓఎన్జీసీ టాప్ గెయినర్స్గా నిలిచాయి. అలాగే జియో ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, మారుతీ, ఎన్టీపీసీ షేర్లు టాప్ లూజర్స్గా నిలిచాయి. ఇవాళ 48 షేర్లలో షార్ట్ కవరింగ్ కన్పించగా, 70 షేర్లలో లాంగ్ అన్వైండింగ్ వచ్చింది. అలాగే లాంగ్లో 48, షార్ట్లో 58 షేర్లు ముగిశాయి.