For Money

Business News

25000పైన ముగిసిన నిఫ్టి

మిడ్‌ సెషన్‌ వరకు ఊగిసలాడిన మార్కెట్‌… చివరి సెషన్‌లో ఊపందుకుంది. ఇవాళ వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ కారణంగా అనేక మంది ఇన్వెస్టర్లు భారీ ఎత్తున షార్ట్‌ కవరింగ్‌కు పాల్పడ్డారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పలుమార్లు నష్టాల్లోకి జారుకున్న మార్కెట్‌… ఒకదశలో 24494 పాయింట్ల కనిష్ఠ స్థాయికి చేరింది. అక్కడి నుంచి వచ్చిన షార్ట్‌ కవరింగ్‌ నిఫ్టిని 25116 పాయింట్ల గరిష్ఠ స్థాయి వరకు తీసుకెళ్ళింది. అంటే 600 పాయింట్లకు పైగా పెరిగింది. చివరల్లో లాభాల స్వీకరణ కారణంగా నిఫ్టి 25062 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 395 పాయింట్లు పెరిగింది. ఇవాళ ఎన్‌ఎస్‌ఈలో అప్పర్‌ సర్క్యూట్‌ తాకిన షేర్ల సంఖ్య175. దాదాపు అన్ని రంగాల సూచీలు ఇవాళ గ్రీన్‌లో క్లోజ్‌ కావడం విశేషం. నిఫ్టిలో ఇవాళ హీరో మోటోకార్ప్‌ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. తరువాతి స్థానాల్లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా మోటార్స్‌, ట్రెంట్‌, శ్రీరామ్‌ ఫైనాన్స్‌ నిలిచాయి. ఇక నష్టాల్లో ముగిసిన ఏకైన నిఫ్టి షేర్‌ ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌. అకౌంటింగ్‌కు సంబంధించి స్కామ్‌ జరిగిందని ఈ బ్యాంక్‌పై ఇవాళ ప్రధాన పత్రికల్లో వార్తలు వచ్చాయి. దీంతో ఈ షేర్‌ 4 శాతంపైగా నష్టంతో ప్రారంభమైంది. అయితే చివరికల్లా కోలుకుని కేవలం 0.17 శాతం నష్టంతో క్లోజైంది.