24 గంటల్లో ట్రంప్ షాక్

భారత్ పట్ల అమెరికా వైఖరి మరింత ముదురుతోంది. అధ్యక్షుడు ట్రంప్ భారత్పై తన ఆక్రోశాన్ని మరోసారి వెళ్ళగక్కారు. భారత్ మంచి వాణిజ్య భాగస్వామి కాదని ఆరోపించారు. పైగా మరో 24 గంటల్లో మరిన్ని సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్ళు చేయడంపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. మాతో భారత్ పెద్దమొత్తంలో వ్యాపారం చేస్తున్నా… తాము మాత్రం ఆ స్థాయిలో చేయడం లేదని ట్రంప్ అన్నారు. అందుకే 25శాతం సుంకాలు విధించామని అంటూనే… మరో 24 గంటల్లో దీన్ని గణనీయంగా పెంచబోతున్నామని హెచ్చరించారు. అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ భారత్ పత్రికా ప్రకటన చేసిన 24 గంటల్లోనే ట్రంప్ మరో హెచ్చరిక చేయడం విశేషం. దీంతో ట్రంప్ వేటిపై ఎంత మేరకు సుంకం విధిస్తారో అన్న టెన్షన్ భారత పారిశ్రామిక రంగాల్లో కన్పిస్తోంది.