For Money

Business News

మెఘాకు 33 జిల్లాల్లో గ్యాస్‌ పంపిణి హక్కులు

దేశంలోని 208 జిల్లాల్లో సిటీ గ్యాస్‌ పంపిణీ నెట్‌వర్క్‌ హక్కుల కోసం పెట్రోలియం అండ్‌ న్యాచురల్‌ గ్యాస్‌ రెగ్యులేటరి బోర్డు (PNRGB) బిడ్డింగ్‌ నిర్వహించింది. 2021 సెప్టెంబర్‌ 17న బిడ్స్‌ను ఆహ్వానించారు. తరవాత జిల్లాలను 215కు పెంచారు. గత ఏడాది డిసెంబర్‌ 15 వరకు బిడ్లు స్వీకరించారు. మొత్తం 26 బిడ్డింగ్‌ సంస్థల నుంచి 439 బిడ్లు వచ్చాయి. జేనవరి 27న జరిగిన బోర్డు మీటింగ్‌లో బిడ్స్‌ను పరిశీలించి 13 సంస్థలకు లెటర్స్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ జారీ చేశారు. అత్యధిక జిల్లాలు అదానీ టోటల్‌ గ్యాస్‌ లిమిటెడ్‌కు దక్కాయి. మొత్తం 50 జిల్లాలు అదానీకి దక్కగా, మెఘా 33 జిల్లాలు దక్కినట్లు తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, గుంటూరు, ప్రకాశం జిల్లాలలో సిటీ గ్యాస్‌ పంపిణిని ఇండియన్‌ ఆయిల్ కార్పొరేషన్‌ చేపడుతుంది.
తెలంగాణలోని జోగులాంబ గద్వాల్‌, నాగర్‌ కర్నూల్‌, మహబూబ్‌ నగర్‌, నారాయణ పేట్‌, వనపర్తితో పాటు కర్ణాటకలోని యాదగిర్‌, చిక్కబళ్ళాపూర్‌ జిల్లాలో గ్యాస్‌ నెట్‌వర్క్‌ బిడ్‌లను మెఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ గెల్చుకుంది.
తెలంగాణలోని నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల్‌, కొమరం భీమ్ ఆసిఫా బాద్‌, కామారెడ్డి జిల్లాల్లో సిటీ గ్యాస్‌ పంపిణీ నెట్‌ బిడ్లను మహారాష్ట్ర నేచురల్ గ్యాస్‌ లిమిటెడ్‌ దక్కించుకుంది.
ఇక తమిళనాడులో అధిక జిల్లాలను మెఘా ఇంజినీరింగ్‌ దక్కించుకుంది. ఈ కంపెనీ దక్కించుకున్న జిల్లాలు తిరువన్నామలై, విల్లూపురం, కళ్ళకురిచ్చి, అరియాలూర్‌, పెరంబలూర్‌, పుదుక్కొటై, శివగంగ, తంజావూర్‌, దిండిగల్‌, కరూర్‌ జిల్లాలను దక్కించుకుంది. ఒడిశాలో రాయగడ, కలహండి, బొలన్‌గిర్‌, నౌపాడా మహారాష్ట్రలోని చంద్రాపూర్‌, వార్ధా జిల్లాలు మెఘా చేతికి వచ్చాయి. ఒక మధ్యప్రదేశ్‌లోని హోషంగబాద్‌, నార్సింగ్‌ పూర్‌, సాగర్‌, విదిశ, దమోహ్‌, జబల్‌పూర్‌, కట్ని, మంద్లా, ఉమారియా, దిందోరి, బేతుల్‌, చింద్వారా, సెయోని, బాలాఘట్‌, అగర్‌ మాల్వా, నీముచ్‌, మందసౌర్‌తో పాటు రాజస్థాన్‌కు చెందిన జల్వార్‌ జిల్లాలను మెగా దక్కించుకుంది.