22,500 సేఫ్
మార్కెట్ అత్యంత పటిష్టమైన 22800 స్థాయిని కోల్పోవడంతో మరింత బలహీనపడింది. నిఫ్టికి తదుపరి స్థాయి 22500 కాగా, నిఫ్టి ఇవాళ 22518ని తాకి.. స్వల్పంగా కోలుకుంది. అంటే ఇవాళ్టికి 22500 సేఫ్. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 243 పాయింట్ల నష్టంతో 22553 పాయింట్ల వద్ద ముగిసింది. నిజానికి నిఫ్టి ఇవాళంతా బలహీనంగా ఉంది. భారత్పై ఆంక్షలకు అమెరికా సిద్ధమౌతోందన్న వార్తలతో మార్కెట్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. ముఖ్యంగా ఇవాళ ఐటీ షేర్లలో గట్టి ఒత్తిడి వచ్చింది. ఏవో కొన్ని రంగాలు మినహా ప్రధాన రంగాలన్నీ ఇవాళ దారుణంగా దెబ్బతిన్నాయి. నిఫ్టి నెక్ట్స్ది కూడా అదే స్థితి. ఒక్క నిఫ్టి మిడ్క్యాప్ 100 సూచీ మాత్రం అర శాతం నష్టంతో బయటపడింది. బ్యాంక్, ఎన్బీఎఫ్సీలదీ అదే పరిస్థితి. ఇవాళ 2970 షేర్లు ట్రేడవగా, 2097 షేర్లు నష్టాల్లో మునిగాయి. ఎం అండ్ ఎం నిఫ్టి షేర్లలో టాప్గెయినర్. కానీ ఈ షేర్ లాభపడింది కేవలం 1.5 శాతమే. ఇక నిఫ్టి టాప్ లూజర్స్ అన్నీ ఐటీ షేర్లే. విప్రో, హెచ్సీఎల్టెక్, టీసీఎస్, ఇన్ఫోసిస్ షేర్లు మూడు శాతం నష్టంతో ముగిశాయి. మిడ్ క్యాప్ ఐటీ షేర్లు కూడా బాగానే పడ్డాయి.