అదే లెవల్స్… అదే ముగింపు
మార్కెట్ గత రోజుల మాదిరిగానే ఇవాళ కూడా డైరెక్షన్ లేకుండా క్లోజైంది. రోజూలాగే ఆరంభంలో పడటం, చివర్లో కోలుకోవడం… స్వల్ప లాభం లేదా నష్టంతో ముగియడం. ఇవాళ కూడా నిఫ్టి ఆరంభంలో వంద పాయింట్లకు పైగా పడింది. మిడ్ సెషన్ నుంచి కోలుకుని క్లోజింగ్కు ముందు ఇవాళ్టి గరిష్ఠ స్థాయి 24360ని తాకింది. కాని చివరల్లో ఢమాల్. క్యాష్ మార్కెట్ క్లోజింగ్లో మళ్ళీ కోలుకుని 24287 వద్ద 78 పాయింట్ల నష్టంతో ముగిసింది. 24300 ప్రాంతంలో క్లోజవడం మార్కెట్కు కాస్త ఊరట కల్గించే అంశం. త్రైమాసిక ఫలతాలు పూర్తి కావొస్తుండటం, క్రూడ్ ఏమాత్రం తగ్గకపోవడం… మార్కెట్ను నిస్తేజంలో పడేసింది. దాదాపు ప్రతి పరిశ్రమ క్రూడ్ వల్ల ఇబ్బంది పడుతోంది. ఇప్పటికే చాలా FMCG కంపెనీలు ధరలు పెంచడం లేదా బరువులు తగ్గించడం చేశాయి. మిగిలిన పరిశ్రమలు కూడా భారీగా నష్టపోతున్నాయి. అలాగే మార్కెట్లో వడ్డీలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం డాలర్ల వేటలో పడి… సాధారణ వడ్డీ సంగతి మర్చిపోయింది. ఇక ద్రవ్యోల్బణం సరేసరి. దాదాపు కరువు లాంటి పరిస్థితి చాలా రాష్ట్రాల్లో నెలకొంది. సెప్టెంబర్ వర్షాలపై చాలా మంది ఆశతో ఉన్నారు. లేదంటే ఈసారి రైతులు పంటల వల్ల భారీగా నష్టపోనున్నారు. ప్రభుత్వం ఇప్పటికి కూడా కరువు పరిస్థితుల గురించి మాట్లాడటం లేదు. దీంతో చాలా మంది ఇన్వెస్టర్లు తాజా పెట్టుబడులకు జంకుతున్నారు. మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్ఫ్లోలు తగ్గుతున్నాయి. విత్డ్రాల్స్ వస్తున్నాయి. దీంతో మార్కెట్ పరిస్థితి త్రిశంకు స్వర్గంలా మారింది. ఇదే ప్రతిరోజూ మార్కెట్లో కన్పిస్తోంది.
