For Money

Business News

మెటల్‌ షేర్లలో పెరిగిన FIIల వాటా

ఇటీవల భారీ ఒత్తిడికి లోనైన మెటల్‌ షేర్లలో విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను పెంచాయి. మార్కెట్లో దాదాపు ప్రధాన రంగాల షేర్లు గత కొంతకాలంగా భారీగా పెరిగినా…మెటల్‌ షేర్లు నిస్తేజంగా ఉన్నాయి. వడ్డీ రేట్లను అమెరికా తగ్గిస్తుందని భావించడంతో పాటు దిగువ స్థాయిలో మెటల్స్‌కు మద్దతు లభిస్తుందనే అంచనాతో విదేశీ ఇన్వెస్టర్లు ఈ రంగానికి చెందిన షేర్లలో తమ పెట్టుబడులను పెంచాయి. ఇతర షేర్లతో పోలిస్తే మెటల్‌ షేర్ల వ్యాల్యూయేషన్‌ తక్కువగా ఉన్న విషయాన్ని విదేశీ ఇన్వెస్టర్లు గుర్తించాయని మార్కెట్‌ నిపుణుడు, జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌కు చెందిన వీకే విజయ్‌ కుమార్‌ అన్నారు. బీఎస్‌ఈ మెటల్‌ ఇండెక్స్‌లోని 11 షేర్లలో విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను పెంచాయి. గత త్రైమాసికానికి సంబంధించి మెటల్‌ కంపెనీలు దాఖలు చేసిన పత్రాల్లో ఈ డేటా వెల్లడైంది. ఏప్రిల్‌-జూన్‌ మధ్య కాలంలో వీరు తమ వాటాను పెంచుకున్నారు. వేదాంత, జిందాల్‌ స్టెయిన్‌లెస్‌, నాల్కో, జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌, హిందాల్కో, టాటా స్టీల్‌, ఎన్‌ఎండీసీలలో విదేశీ ఇన్వెస్టర్ల వాటా పెరిగింది.