రూ. 74 నుంచి రూ. 21 దాకా!

కాఫీ డే ఎంటర్ప్రైజస్ లిమిటెడ్ షేర్ ధర పయనం ఇది. గత ఏడాది ఏప్రిల్ 16న రూ. 74.65 వద్ద ఉన్న ఈ షేర్ ఇవాళ రూ. 21.28 వద్ద ముగిసింది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వియ్యంకుడు, దివంగత వీజీ సిద్ధార్థ్కు చెందిన కాఫీ డే పూర్తిగా రుణ ఊబిలో కూరుకుపోయిన విషయం తెలిసింది. 2019లో అప్పుల బాధతో సిద్ధార్థ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. తరవాత ఆయన కుమారుడు అమర్త్య హెగ్డే వివాహః 2021లో డీకే శివకుమార్ కుమార్తె ఐశ్వర్యతో జరిగింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం పగ్గాలు చేపట్టిన వెంటనే కాఫీ డే షేర్ అనూహ్యంగా పెరిగింది. ఐడీబీఐ ట్రస్టీల నేతృత్వంలో కొన్ని బ్యాంకులు కలిసి కంపెనీపై దివాలా పిటీషన్ వేశారు. దీంతో ఆ షేర్ కాస్త తగ్గినా… ఆ తరవాత కోర్టుల్లో నానుతుండటంతో షేర్ క్రమంగా పెరుగుతూ గత ఏడాది రూ. 75కు చేరువైంది. కాని షేర్ మార్కెట్ పతనంతో పాటు ఈ షేర్ కూడా క్షీణిస్తూ వచ్చింది. అయితే సుప్రీం కోర్టు విధించిన గడువు లోపల ఈ కంపెనీ దివాలా పిటీషన్పై ఎన్సీఎల్టీ చెన్నై శాఖ ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. దీంతో దివాలా పిటీషన్పై విధించిన స్టే తొలగిపోయింది. దీనికి సంబంధించిన వార్త ఇవాళ వచ్చింది. దీంతో ఈ షేర్ ఇవాళ 5 శాతం క్షీణించి రూ 21.28కి చేరింది. మరి రేపు మళ్ళీ లోయర్ సర్క్యూట్ తాకుతుందేమో?