రూ. 11 లక్షల కోట్లు తగ్గే!
పశ్చిమాసియాలో ఇజ్రాయిల్పై ఇరాన్ క్షిపణి దాడులతో ఆ ప్రాంతంలో భౌగోళిక, రాజకీయ పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి.ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారు. అయితే సాయంత్రం వెలువడిన గణాంకాలను బట్టి చూస్తే విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు భారీగా ఉన్నాయి. చైనా ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీతో అక్కడి మార్కెట్లు దుమ్మురేపుతున్నాయి. వ్యాల్యూయేషన్ ప్రకారం చూస్తే… మన మార్కెట్లకన్నా చైనా మార్కెట్లు లాభదాయకంగా ఉన్నట్లు విదేశీ ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. దీంతో ఇవాళ రూ.15,243 కోట్ల విలువైన షేర్లను వీరు అమ్మారు. అయితే దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 12,914 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. అయినా నిఫ్టి దాదాపు 550 పాయింట్లు నష్టపోవడానికి కారణం… రీటైల్ ఇన్వెస్టర్లు కూడా అమ్మకాలకు పాల్పడటమే. ఎఫ్ అండ్ ఓ విభాగంలో రీటైల్ ఇన్వెస్టర్లను కట్టడి చేసేందుకు సెబీ తీసుకున్న చర్యలు కూడా మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసింది. వెరశి ఇవాళ బీఎస్ఈలో షేర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏకంగా రూ. 11 లక్ష్ల కోట్లకు పైగా తగ్గింది. ముఖ్యంగా రిలయన్స్, హెచ్డీఎఫ్సీ షేర్లలో అమ్మకాలు సూచీలపై ఒత్తిడి పెంచాయి. దాదాపు అన్ని ప్రధాన సూచీలు రెండు శాతం నుంచి రెండున్నర శాతం వరకు క్షీణించడంతో బీఎస్ఈలో కంపెనీల మార్కెట్ విలువ రూ.464.3 లక్షల కోట్లకు పడిపోయింది. పశ్చిమాసియాలో నెలకొన్న భయాల నేపథ్యంలో ముడి చమురు ధరలు పెరగడం భారీగా పెరగడంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల షేర్లు భారీగా దెబ్బతిన్నాయి. మొన్న 68 డాలర్లను తాకిన బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 75 డాలర్లకు చేరడంతో ఓఎంసీల షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. ఇటీవల ఈ షేర్లు భారీగా పెరిగాయి.