ఆర్బీఐ బోర్డులోఆనంద్ మహీంద్రా

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బోర్డులో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా డైరెక్టర్ గా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆనంద్ మహీంద్రాతో పాటు పంకజ్ పటేల్, వేణు శ్రీనివాసన్, మాజీ ఐఐఎం ప్రొఫెసర్ రవీంద్ర ఢోలాకియాలకు ఆర్బీఐ బోర్డులో పార్ట్ టైమ్ నాన్ అఫిషియల్ డైరెక్టర్లుగా స్థానం కల్పించింది. ఈ నియామకాలు జూన్ 14 నుంచి నాలుగేళ్ల పాటు వర్తిస్తాయి. పదవీకాలం పూర్తయ్యేంతవరకు, లేదా ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు వీరు ఆర్బీఐ బోర్డులో కొనసాగుతారు. మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ అయిన ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటారు. వేణు శ్రీనివాసన్ టీవీఎస్ మోటార్ కంపెనీకి గౌరవ చైర్మన్. టీవీఎస్ మోటార్కు మాతృ సంస్థ అయిన సుందరం-క్లేటన్ సంస్థకు సీఈవో. పంకజ్ పటేల్ జైడస్ లైఫ్ సైన్సెస్ సంస్థకు చైర్మన్.
రవీంద్ర ఢోలాకియా అహ్మదాబాద్ ఐఐఎంలో ప్రొఫెసర్ గా పనిచేసి రిటైరయ్యారు. రిజర్వ్ బ్యాంక్ మనీ పాలసీ కమిటీ (ఎంపీసీ)లోనూ సేవలు అందించారు.