ఇవాళ నిఫ్టి ఎందుకు పడింది?
సరిగ్గా మూడు గంటల ప్రాంతంలో మార్కెట్ కనిష్ఠ స్థాయి నుంచి బాగా కోలుకుంది. ఒకదశలో బ్యాంక్ నిఫ్టి ఏకంగా గ్రీన్లోకి వచ్చింది. కాని కేవలం ఏడు నిమిషాల్లో మళ్ళీ రెడ్లోకి వెళ్ళింది. అత్యంత కీలకమైన స్థాయిలను నిఫ్టి కోల్పోతోంది. బ్యాంక్ నిఫ్టి కూడా. హెచ్డీఎఫ్సీ బ్యాంక్తో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకులు బ్యాంక్ నిఫ్టిని దారుణంగా దెబ్బతీశాయి. ఒక ఐటీ మినహా ఇతర ఏ రంగం కూడా నిఫ్టికి తోడుగా నిలవలేదు. దీంతో రెండు సూచీలపై చివరి అరగంటలో తీవ్ర ఒత్తిడి వచ్చింది. 2 గంటల తరవాత బ్రెంట్ క్రూడ్ ఏకంగా 80 డాలర్లకు చేరువ కావడం, డౌజోన్స్ ఫ్యూచర్స్ 200 పాయింట్ల వరకు క్షీణించడంతో పాటు అమెరికా పదేళ్ళ బాండ్ ఈల్డ్ 4కు చేరడంతో… అమ్మకాల ఒత్తిడి తీవ్రమైంది. ఇజ్రాయిల్ ఈరాత్రికి తన దాడులను మరింత తీవ్రం చేస్తుందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్ పూర్తి నెగిటివ్ జోన్లోకి వెళ్ళింది. నిఫ్టి ఇవాళ ఆరంభంలోనే 25,143 పాయింట్ల స్థాయిని తాకింది. అక్కడి నుంచి పడుతూ వచ్చిన నిఫ్టి క్లోజింగ్ ముందు 24694 పాయింట్ల కనిష్ఠస్థాయిని తాకింది. చివరల్లో 24,795 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 218 పాయింట్లు క్షీణించగా, సెన్సెక్స్ 638 పాయింట్ల నష్టంతో ముగిశాయి. ఇవాళ చాలా వరకు ఐటీ నిఫ్టి బలంగా ఉంది. పీఎస్యూ నిఫ్టి సూచీ మూడు శాతంపైగా క్షీణించింది. నిఫ్టి టాప్ గెయినర్స్లో ట్రెంట్ టాప్లో ఉంది. తరవాతి స్థానాల్లో ఎం అండ్ ఎం, భారతీ ఎయిర్టెల్, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి. నష్టపోయిన నిఫ్టి షేర్లలో అదానీ పోర్ట్స్ టాప్లో ఉంది. ఈ షేర్ ఇవాళ 4శాతంపైగా నష్టపోయింది. తరవాతి స్థానాల్లో బీఈఎల్, అదానీ ఎంటర్ప్రైజస్, కోల్ ఇండియ, ఎన్టీపీసీ ఉన్నాయి. ఇవాళ కూడా 54 షేర్లు అప్పర్ సర్క్యూట్ను తాకగా, 420 షేర్లు లోయర్ సర్క్యూను తాయి. అలాగే 131 షేర్లు 52 వారాల కనిష్ఠ స్థాయిని తాకగా, 56 షేర్లు 52 వారాల గరిష్ఠ స్థాయిని తాకాయి.