ప్లేటు ఫిరాయించిన ఇండోనేషియా
ప్రపంచ వంటనూనెల మార్కెట్లో అనిశ్చితి కొనసాగుతోంది. తమ దేశం నుంచి అన్ని రాకల పామోలిన్ ఆయిల్ ఎగుమతులను నిషేధించినట్లు ఇండోనేషియా తొలుత ప్రకటించింది.దీంతో ప్రపంచ వ్యాప్తంగా వంటనూనెల మార్కెట్లో కలకలం రేగింది. ఎందుకంటే ధరలు అందుబాటులో ఉంచేందుకు మెజారిటీ నూనెల్లో పామోలిన్ కలుపుతారు. దీంతో ఇండోనేషియా నిర్ణయం భారత్తో సహా అనేక దేశాలకు షాక్ కలిగింది. తరవాత ముడి పామోలిన్ ఎగుమతులపై ఎగుమతి నిషేధం ఉండదని… కేవలం రీఫైన్డ్ ఆయిల్పై ఉంటుందని పేర్కొంది. దీంతో అనేక మార్కెట్లలో పామోలిన్ ఆధారిత అనేక కంపెనీల ధరలు పెరిగాయి. వంటనూనెలతో పాటు హిందుస్థాన్ లీవర్ వంటి కంపెనీలకు పామోలిన్ అత్యంత కీలకం. ఇండోనేషియా తాజా నిర్ణయంతో ఊరట చెందిన దేశాలకు నిన్న ఇండోనేషియా ఆర్థిక వ్యవహారాల మంత్రి మళ్ళీ పాత పాటే పాడారు. ముడి పామోలిన్ను కూడా ఎగుమతి చేయమని స్పష్టం చేశారు. తమ దేశంలో ధరలు బాగా పెరిగాయని…దేశీయంగా పరిస్థితి మెరుగుపడే వరకు ఎగుమతులను అనుమతించమని అన్నారు. ఎగుమతులపై నిషేధం ఇవాళ్టి నుంచి అమల్లోకి రానుంది.