అన్నీ పెరిగినా… నిఫ్టి మాత్రం
నిన్న అంతర్జాతీయ మార్కెట్లలో బాండ్ ఈల్డ్స్ గణనీయంగా తగ్గాయి. అమెరికాతో పాటు అనేక దేశాల్లో నిన్న ప్రభత్వ బాండ్లకు గట్టి డిమాండ్ వచ్చింది. దీంతో ఈల్డ్స్ తగ్గాయి. దీని ప్రభావం ప్రపంచ ఈక్విటీ మార్కెట్లో కన్పించింది. రాత్రి నాస్డాక్ ఒకటిన్నర శాతం దాకా లాభపడింది. డౌజోన్స్ కూడా ఒక శాతం లాభపడింది. అనేక షేర్లు రాత్రి భారీ లాభాలతో ముగిశాయి. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లలో కూడా మంచి మూడ్ కన్పించింది. కాని మన మార్కెట్లు మాత్రం ఇంకా నిస్తేజంగానే ఉన్నాయి. నిఫ్టి కేవలం నామమాత్రపు లాభాలతో ప్రారంభం కానుంది. దీనికి ప్రధాన కారణం క్రూడ్ ధరలు ఇంకా అధిక స్థాయిలో ఉండటమే. బ్రెంట్ క్రూడ్ ఇంకా 96 డాలర్ల వద్ద ఉంటోంది. ఫలితంగా ప్రభుత్వం తెస్తున్న డాలర్లు ఎంత వరకు ఉంటాయో అన్న అనుమానం వ్యక్తం అవుతోంది. పైగా తెస్తున్న డాలర్లతో దేశంలో లిక్విడిటీ మరింత పెరిగే అవకాశముంది. అలాగే మున్ముందు డాలర్ పెరిగితే పరిస్థితి ఏమిటి? ప్రభుత్వం డాలర్లను ఎక్కడి నుంచి తెస్తుందనే ప్రశ్నలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో నిఫ్టి ఇవాళ నిస్తేజంగా ప్రారంభం కానుంది. అనేక మంది విదేశీ ప్రమోటర్లు మన కంపెనీల్లో వాటాలను అమ్మేస్తున్నారు. ఇవాళ గ్లాండ్ ఫార్మాలో చైనా కంపెనీ ఏకంగా 5 శాతం వాటాను బ్లాక్ డీల్లో అమ్మేస్తుంది. రాత్రి బంగారం ధరలు బాగా పెరిగినందున ఇవాళ గోల్డ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు పెరగవచ్చు. అలాగే స్మాల్ క్యాప్ సూచీలోని షేర్లు కూడా.
