వేదాంత చేతికి మీనాక్షి ఎనర్జీ
పీకలోతు అప్పుల్లో కూరుకుపోయిన హైదరాబాద్ కంపెనీ మీనాక్షి ఎనర్జీని అనిల్ అగర్వాల్కు చెందిన వేదాంత లిమిటెడ్ టేకోవర్ చేయనుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనకు నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ), హైదరాబాద్ బెంచ్ పచ్చజెండా ఊపింది. ఇదే కంపెనీ కోసం పోటీ పడిన ప్రుడెంట్ ఏఆర్సీ, వైజాగ్ మినరల్స్ అండ్ లాజిస్టిక్స్ లేవనెత్తిన అభ్యంతరాలను ఎన్సీఎల్టీ తోసిపుచ్చింది. రూ.1,440 కోట్లతో మీనాక్షి ఎనర్జీని సొంతం చేసుకునేందుకు ముందుకు వచ్చిన వేదాంత … రూ.312 కోట్లను ముందుగా చెల్లించింది. మిగిలిన మొత్తాన్ని వచ్చే ఐదేళ్లలో డిబెంచర్ల రూపంలో అందిస్తుంది. 1000 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ కలిగిన మీనాక్షి ఎనర్జీపై 2019లో కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రాజెక్ట్ను చేపట్టాలని కోరుతూ ఎన్సీఎల్టీలో కేసు దాఖలైన విషయం తెలిసిందే.