సాయి పేరెంటరల్ ఐపీఓ నేడు
హైదరాబాద్ చెందిన సాయి పేరెంటరల్ లిమిటెడ్ పబ్లిక్ ఆఫర్ నేడు ప్రారంభం కానుంది. మార్కెట్ నుంచి ఈ కంపెనీ రూ. 408.79 కోట్లు సమీకరించేందుకు ప్రైమరీ మార్కెట్కు వస్తోంది. కొత్త షేర్ల జారీ ద్వారా రూ.285 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ కింద రూ. 123.79 కోట్ల సమీకరిస్తోంది ఈ కంపెనీ. పబ్లిక్ ఆఫర్ ధరల శ్రేణి రూ. 372-రూ.392గా నిర్ణయించింది. కనీసం 38 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు మొత్తం రూ. 14,896. ఈ షేర్లుఏప్రిల్ 2న లిస్ట్ అవుతాయి.
యాంకర్ ఇన్వెస్టర్ల ద్వారా రూ. 122.64 కోట్లను కంపెనీ విజయవంతంగా సమీకరించింది. యాంకర్ ఇన్వెస్టర్లలో కొటక్ లైఫ్ సైన్సస్, ఇండియా ఎమర్జింగ్ జైంట్స్ ఫండ్, మోర్గాన్ స్టాన్లీ ఏషియా, కొటక్ మహీంద్రా లైఫ్ ఇన్సూరెన్స్, క్వాంట్ మ్యూచువల్ ఫండ్ ఉన్నాయి. వీటికి రూ. 392 వద్ద షేర్లను కంపెనీ కేటాయించింది. 2001 నుంచి ఫార్మా వ్యాపారంలో ఉన్న సాయి పేరెంటరల్ కంపెనీ బ్రాండెడ్ జనరిక్ ఫార్ములేషన్స్తో పాటు సీడీఎంఓలో నిమగ్నమై ఉంది. గత ఏడాది మార్చి నెలాఖరుకు రూ. 163.74 కోట్ల టర్నోవర్పై రూ. 14.43 కోట్ల నికర లాభం ఆర్జించింది ఈ కంపెనీ. తెలంగాణలో ఈ కంపెనీకి మూడు, ఏపీలో ఒక ప్లాంట్ ఉన్నాయి. ఆస్ట్రేలియాలో నౌమెడ్ ఫార్మాస్యూటికల్స్ను కంపెనీ టేకోవర్ చేసింది. దీనికి అవసరమైన నిధుల్లో రూ.35 కోట్లను పబ్లిక్ ఆఫర్ సొమ్ము వెచ్చించనుంది. ఇష్యూ మొత్తంలో రూ. 100 కోట్లు ప్లాంట్ విస్తరణకు ఉపయోగిస్తామని ప్రమోటర్లు అంటున్నారు. ఆస్ట్రేలియా కంపెనీ టేకోవర్, వర్కింగ్ క్యాపిటల్కు రూ.68 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు.
